తుని కేసు రీ ఓపెన్పై ఏపీ సర్కారు కీలక టర్న్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన తుని రైలు దహనం సంఘటనకు సంబంధించిన కేసులో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును తిరగదోడే ఉద్దేశ్యం లేదని తెలిపింది. హైకోర్టుకు అప్పీల్కు వెళ్లడం లేదంటూ స్పష్టం చేసింది. రైల్వే కోర్టు జారీచేసిన ఆదేశాలపై అప్పీల్కు వెళ్లే ఆలోచనను విరమించుకోవాలని సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సున్నితమైన అంశాల్లో అధికారులు అలసత్వంగా వ్యవహరించవద్దన్న సర్కారు.. ఈ కేసును రీ-ఓపెన్ చేసే ఆలోచన లేదని ప్రకటన చేసింది. అయితే.. తుని రైలు దహనం కేసును రీ-ఓపెన్ చేయనున్నట్లు సోమవారం పలువురు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఆలోచనకు సంబంధించిన నిర్ణయం తెరపైకి వచ్చిన 24 గంటల్లోనే కేసును రీఓపెన్ చేయాలనే యోచనను విరమించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సున్నితమైన ఈ కేసును తిరగదోడే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అప్పీల్ ఆలోచన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
2016 జనవరి 31వ తేదీన కాకినాడ జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్కు పలువురు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలంటూ అప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో వేలాది మంది తునిలో జరిగిన బహిరంగ సభకు తరలివచ్చారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత.. సభకు వచ్చిన వారిలో పలువురు నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను నిలిపివేసి.. రైలు బోగీలకు నిప్పుపెట్టారు. ఆ సమయంలో పక్కా ప్రణాళిక ప్రకారమే ఆందోళన కారులు పెట్రోల్ బాటిళ్లు తీసుకువచ్చి రైలు తగలబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ కేసుపై పలు దశలుగా విచారణ జరిగింది. చివరికి.. 2023 మే 1వ తేదీన విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసును కొట్టేసింది.
ఈతీర్పుతో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా మరికొందరికి ఊరట దొరికింది. అయితే కేసులో విచారణ సరిగ్గా జరగలేదని నాడు రైల్వే పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయారంటూ ఆక్షేపించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చినా.. 24 గంటలు గడిచేలోపే ప్రభుత్వం రీఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులు వెలువడటం, ఆ తక్షణమే ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై సర్కార్ ఆరా తీసింది. కేసుపై ఆర్పీజీ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టు గుర్తించింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం నుంచి అధికారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.