Ram Mohan Naidu: రాష్ట్ర కీలక ప్రాజెక్టుల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష..భోగాపురం విమానాశ్రయం జూన్లో ప్రారంభం.. రామ్మోహన్ నాయుడు యుద్ధప్రాతిపదికన చర్యలు
భోగాపురం విమానాశ్రయం జూన్లో ప్రారంభం.. రామ్మోహన్ నాయుడు యుద్ధప్రాతిపదికన చర్యలు
విజయవాడ విస్తరణ, విశాఖ రైల్వే జోన్పై రామ్మోహన్ నాయుడు యుద్ధప్రాతిపదికన చర్యలు
Ram Mohan Naidu: రాష్ట్రానికి చెందిన మూడు కీలక ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం ఢిల్లీలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చనున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, విజయవాడ విమానాశ్రయ విస్తరణ, విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పురోగతిని వివిధ శాఖల అధికారులతో విడివిడిగా చర్చించారు.
పౌర విమానయాన శాఖ అధికారులతో ఉదయం జరిగిన సమీక్షలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు జూన్ నెలలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు కొత్త కాంట్రాక్టర్కు అప్పగించిన తర్వాత ఎంతవరకు పురోగతి సాధించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు విమానాశ్రయాలకు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు యుద్ధప్రాతిపదికన అందించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం, విజయవాడల నుంచి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని విమానయాన సంస్థల ప్రతినిధులను మంత్రి కోరారు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న వారణాసి, శిర్డీ, గోవా, పుణె, కొచ్చిన్, అహ్మదాబాద్ వంటి నగరాలతో కనెక్టివిటీ మరింత మెరుగుపరచాలని ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ, ఫ్లై91, స్టార్ ఎయిర్ సంస్థలకు సూచనలు చేశారు. రాష్ట్రం నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని ఆయన ఒత్తిడి చేశారు.
అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి మరో సమీక్ష నిర్వహించిన రామ్మోహన్ నాయుడు, గుజరాత్లో అభివృద్ధి చేస్తున్న ధొలేరా పారిశ్రామిక నగర విమానాశ్రయానికి రైల్వే లైన్ అనుసంధానం ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే సందర్భంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలు రైళ్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా సికింద్రాబాద్, తిరుపతి వరకు కొత్త సర్వీసులు ప్రారంభించాలని కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆయన ప్రధానంగా కోరారు.
ఈ సమీక్షలతో రాష్ట్రానికి చెందిన మూడు కీలక ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలనే లక్ష్యం సాధించడం ఖాయమని మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.