ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకరించండి
అమిత్ షా కు నారా లోకేష్ విజ్ఞప్తి;
ఆంధ్రప్రదేశ్ లో మొదలవుతున్న నూతన ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందిచాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖలమంత్రి నారా లోకేష్ కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితులను నారా లోకేష్ కేంద్ర హోంమంత్రికి వివరించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నయోగాంద్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరవుతున్న నేపధ్యంలో చేస్తున్న విస్తృతమైన ఏర్పాట్లను అమిత్ షాకు తెలిపారు. ఇక రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని ఈ భేటీలో నారాలోకేష్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.