Union Minister Jaishankar : ఆంధ్రప్రదేశ్ లో డాటా సిటీ ఏర్పాటుకు సహకరించండి

కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌;

Update: 2025-08-18 06:22 GMT

ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తిచేశారు. న్యూఢిల్లీలో సోమవారం ఉదయంకేంద్ర మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డాటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాడంతో పాటు, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎపిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని లోకేష్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించమని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటనకు సంబంధించి వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల వివరాలను లోకేష్ కేంద్రమంత్రికి వివరించారు. దీనికి మీ పూర్తి సహకారం కావాలని లోకేష్ జైశంకర్ ను కోరారు.

ఎపికి చెందిన సుమారు 35లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారు. అమెరికాలో 10లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8లక్షలు, ఐరోపా దేశాల్లో 4లక్షలమంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. యుఎస్ లో అక్కడ ప్రజల తలసరి ఆదాయం $70,000 డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం $1,26,000 డాలర్లుగా ఉంది. ఐరోపాదేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ లతో మొబిలిటీ, మైగ్రేషన్ (MMPA) భాగస్వామ్యాలను ఏర్పాటుచేయడంలో కేంద్ర చర్యలు అభినందనీయమని నారా లోకేష్‌ అన్నారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ పూర్తి మద్దతునిస్తిందని వెల్లడించారు. కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, రాష్ట్రస్థాయిలో ఆయా ఒప్పందాలను అమలుచేయడంలో ఎపి ముందంజలో ఉంటుందని మంత్రి లోకేష్ కేంద్రమంత్రి జైశంకర్‌కు చెప్పారు.

స్కిల్ డెవలప్ మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్ షిప్స్ కోసం నైపుణ్య భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఎపి ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని కేంద్రమంత్రికి లోకేష్‌ తెలిపారు. ఇందులో రష్యా, ఆస్టేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ ఎసెస్ మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ ను త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పారు. నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్జానాన్ని రప్పించడానికి జపాన్, కొరియా, తైవాన్లతో కలసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్ మెంట్ (MMPA) ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టిసారించామని తెలిపారు. ప్రపంచ డయాస్పోరా వేదికగా ఐటి, సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత విద్య రంగంలో పెట్టుబడులు, నాలెడ్జి ట్రాన్సఫర్ కోసం ఎపి ప్రభుత్వం పిలుపునిచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు డాటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్రమంత్రి జైశంకర్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News