Stree Shakthi : స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్
స్త్రీశక్తి -ఉచిత బస్సు ప్రయాణం పథకం పై సీఎం చంద్రబాబు సమీక్ష;
- సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు
- 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం..రూ.19 కోట్ల లబ్ది
- గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీ చూపినా ఉచిత ప్రయాణానికి ఓకే
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయ్యింది. పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా.. దాదాపు రూ.19 కోట్ల మేర వారికి ఆదా అయ్యింది. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఘాట్ రూట్లలోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం అమలుకు ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలిపారు. ఈమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్సుతో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అవుతుందన్న అంశాలను మహిళలు తమతో సంతోషంగా పంచుకుంటున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. స్త్రీశక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.