ప్రతీకార హత్యలతో బుసలు కొడుతున్న కక్షలు
పల్నాడు జిల్లా.. సున్నితమైన ఏరియా. ఇక, మాచర్ల నియోజకవర్గం అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నిత్యం ఫ్యాక్షన్ గొడవలు సర్వ సాధారణమన్న పేరుంది. ఇక, ఇప్పుడు ఇద్దరు టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆధిపత్య పోరే ఈ హత్యలకు కారణంగా తేలింది. దీంతో, పల్నాడు ప్రాంతం మరొక్కసారి ఉలిక్కిపడింది.
వెల్దుర్తి మండలంలో ఆధిపత్య పోరు ఇద్దరిని బలి గొంది. బోదిలవీడులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు అనే అన్నదమ్ముల్దిద్దరిని కారుతో ఢీకొట్టి హతమార్చారు ప్రత్యర్థులు. అయితే, అత్యంత సమస్యాత్మక గ్రామంగా గుర్తించినా.. గుండ్లపాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్యలు జరిగాయనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు హత్యలు ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగినట్టు అర్థమవుతోంది.
గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు.. తెలంగాణలోని నక్కలగూడెం గ్రామానికి ఓ శుభకార్యానికి వెళ్లారు. మొత్తం నాలుగు ద్విచక్ర వాహనాలపై 8 మంది అక్కడికి వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ గుండ్లపాడుకు తిరిగి బయలుదేరారు. అయితే.. మాచర్ల నుంచి గ్రామానికి వెళ్తున్న సమయంలో వీళ్లు వెళ్లిన నాలుగు బైక్లలో రెండు బైక్లు వీళ్లకంటే కొంత ముందుగా వెళ్లిపోయాయి. ఆ తర్వాత జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు బయలుదేరారు. వీరి వెనకాల జవిశెట్టి వెంకటేశ్వర్లు అల్లుడు, మరొకరు వస్తున్నారు. వీరందరికంటే ముందు గుండ్లపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్పై వెళుతూ.. వీరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు హంతకులకు తెలియజేశారని తెలుస్తోంది. ఈ వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే ముందుగా రెండు బైక్లు వెళ్లిపోయిన తర్వాత.. మూడో బైక్పై వస్తున్న అన్నదమ్ములిద్దరిని ప్లాన్ చేసి మరీ.. కారుతో ఢీకొట్టి చంపేశారు. వీళ్లను ఢీకొట్టిన తర్వాత.. కారులోంచి దిగిన వాళ్లు.. కోటేశ్వరరావు ఇంకా కొనఊపిరితో ఉన్నాడని గుర్తించి.. రాయితో మోది అతన్ని కూడా చంపేశారు. ఇద్దరూ చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత.. వెనుకగా వస్తున్న వారిని చూసి హంతకులు పరారయ్యారు. హంతకులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి కూడా తన బైక్ను అక్కడే పడేసి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
గుండ్లపాడు.. సున్నితమైన గ్రామం. ఇక్కడ గొడవలు జరగకుండా పోలీసులు అనేక చర్యలు చేపట్టారు. స్వయంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పల్లె నిద్ర చేశారు కూడా. ప్రశాంత వాతావరణంలో జీవించాలని గ్రామస్తులందరికీ హితబోధ చేశారు. అయినా.. ఫలితం లేదు. వర్గపోరుకు అడ్డుకట్ట పడలేదు. టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య జరిగిన నాటి నుంచి గ్రామంలో పోలీసుల పికెట్ కొనసాగుతోంది. అయినా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గ్రామంలో ఏప్రిల్లో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. అప్పటినుంచీ శాంతిభద్రతలు అదుపులో లేవనే టాక్ వినిపిస్తోంది. వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. పోలీసులు ముందే ఈ విషయాన్ని గ్రహిస్తే.. రెండు నిండు ప్రాణాలు పోయేవి కావని అంటున్నారు.