Nara Lokesh: సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన - 25 వేల మత్స్యకార కుటుంబాల జీవనం మార్చేస్తాం: మంత్రి నారా లోకేశ్
25 వేల మత్స్యకార కుటుంబాల జీవనం మార్చేస్తాం: మంత్రి నారా లోకేశ్
Nara Lokesh: ఏపీలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని, 25 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉండటం వల్ల అనేక అభివృద్ధి అవకాశాలు లభిస్తాయన్నారు.
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమకు మంత్రి లోకేశ్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటానమస్ మారిటైమ్ షిప్యార్డును సాగర్ డిఫెన్స్ అభివృద్ధి చేయనుందని తెలిపారు. మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టి 750 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సాగర్ డిఫెన్స్ సంస్థ అన్మాన్డ్ మెరైన్ సర్ఫేస్ వెహికల్స్ రంగంలో ప్రముఖంగా పనిచేస్తోంది. ఇప్పటికే దేశ నౌకాదళం, ఐడెక్స్తో సహా వివిధ భద్రతా సంస్థలతో సహకరిస్తోంది.
ఇక్కడ ఇంటెలిజెన్స్ మారిటైమ్ సిస్టమ్స్, సెన్సార్లు, కమాండ్ కంట్రోల్ టెక్నాలజీల అభివృద్ధి జరుగుతుందని లోకేశ్ వెల్లడించారు. భవిష్యత్తులో ఆధునిక నౌకాదళ కార్యకలాపాలకు ఈ షిప్యార్డు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏపీ అభివృద్ధికి మైలురాయి అవుతుందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.