Jagan Appears Before CBI Special Court: అక్రమాస్తుల కేసులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట విచారణకు ఆయన ప్రత్యక్షంగా రావడం ఆసక్తికరంగా మారింది.

విజయవాడ నుంచి ఉదయం విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు జగన్‌ వెళ్లారు. విచారణ పూర్తయిన అనంతరం ఆయన లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నేత పేర్ని నాని సహా మరో ముగ్గురు నాయకులను పోలీసులు కోర్టు ఆవరణలోకి అనుమతించలేదు. దీంతో వారు గేటు వద్దే ఆగిపోయారు.

2012లో సీబీఐ నమోదు చేసిన ఈ అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్‌ బెయిల్‌పై ఉన్నారు. ఇటీవల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సీబీఐ దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. గత ఆరేళ్లుగా జగన్‌ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని, ప్రస్తుతం డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా హాజరు కావాలని సీబీఐ వాదించింది.

దీంతో కోర్టు ఈ నెల 21లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే జగన్‌ గురువారం కోర్టుకు చేరుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.

Tags: