గెలిచింది కూటమి కాదు… ప్రజలు – నారా లోకేష్
గతేడాది జూన్ 4వ తేదీని ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది కూటమి కాదని రాష్ట్ర ప్రజలు గెలిచారని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నారా లోకేష్ ప్రసంగిస్తూ గత ఐదేళ్ళ విధ్వంస పాలనలో కంపెనీలను తరిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా పెట్టుబడి పెడతామని ఏపీలో మాత్రం పెట్టుబడి పెట్టమని లూలూ అన్నారని చెప్పారు. ఒక నియంత పాలన నుంచి ప్రజలకు స్వతంత్రం వచ్చిందన్నారు. గత పాలకులు వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్ళు తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నెల నుంచే వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చామని గుర్తు చేశారు. పెన్షన్ల ద్వారా 34వేల కోట్లు, తల్లికి వందనం ద్వారా 67లక్షల 27 వేల 164 మంది విద్యార్ధులకు రూ.8745 కోట్లు జమ చేశామని నారా లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ తెచ్చామని, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేస్తామని లోకేష్ ప్రకటించారు. అమరావతి పనులు డబుల్ స్పీడ్ తో ముందుకు వెళుతున్నాయని, ఒక్క ఏడాదిలోనే రూ9.65 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని నారా లోకేష్ చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఘనతలు ఇవే అన్నారు. గత ప్రభుత్వం ఆహంకార చేష్టల వల్లే 151 స్ధానాల నుంచి 11 స్ధానాలకు పడిపోయారని మంత్రి నారా లోకేష్ అన్నారు.