Minister Nimmala Ramanaidu: రంగా హత్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతమ్రెడ్డికి పదవి ఇచ్చి సత్కరించింది జగనే: మంత్రి నిమ్మల రామానాయుడు
గౌతమ్రెడ్డికి పదవి ఇచ్చి సత్కరించింది జగనే: మంత్రి నిమ్మల రామానాయుడు
Minister Nimmala Ramanaidu: వంగవీటి రంగాను రౌడీగా దూషిస్తూ, "ఆయన్ను చంపితే తప్పేమిటి?" అని అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్రెడ్డికి ఫైబర్నెట్ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు.
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, వంగవీటి రంగా హత్య కేసు నిందితులు నేడు వైకాపాలో ఉండి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పేరు చివర 'రెడ్డి' అని చేర్చుకున్న ముద్రగడ పద్మనాభం కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, జగన్ మెప్పు కోసం ఆయన తన స్థాయిని తగ్గించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేశారని గుర్తుచేశారు. అంబటి రాంబాబు చంద్రబాబుపై మురికి మాటలు మాట్లాడితే జగన్ ఎందుకు తప్పు అని చెప్పలేదని ప్రశ్నించారు. వైకాపా హయాంలో సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెడితేనే జైలుకు పంపిన జగన్, ఇప్పుడు ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పార్టీ పరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిమ్మల నిలదీశారు.
తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అంబటి రాంబాబును జగన్ పావులా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.