తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యింది. ఈ వివాదంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ చెప్పారు. ఈ వ్యవహారంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు వైఎస్ జగన్ పేరు కూడా ప్రస్తావించడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలిసారి ఈ అంశంపై స్పందించారు.



షర్మిల ఫోన్ ట్యాప్ అయిందా లేదా తెలియదు.. కానీ, ఆమె గతంలో తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారని, తెలంగాణలో ఏం జరుగుతోందనే విషయాల్లో తనను ఎందుకు లాగుతున్నారనేదే ఆశ్చర్యంగా ఉందన్నారు వైఎస్‌ జగన్‌. తాను ఆంధ్రప్రదేశ్‌లోని అంశాలపై మాత్రమే దృష్టి పెడతానని, తెలంగాణలో జరిగే వ్యవహారాల్లో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.



కాగా, ఇటీవల షర్మిల మీడియాతో మాట్లాడుతూ, తన ఫోన్ ట్యాప్ చేశారని, తన భర్త ఫోన్‌ను కూడా హ్యాక్ చేశారని, ఇవన్నీ కేసీఆర్ సహకారంతో, జగన్‌కు సమాచారం పంపించేందుకు చేశారని, ఇది తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కుట్ర అంటూ తీవ్రంగా విమర్శించారు షర్మిల.


Tags: