PM Modi Expresses Grief Kurnool Bus Accident: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపిన ఆయన, ప్రభుత్వం తరపున రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, దాదాపు 20 మంది చనిపోయారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకొని ఆపరేషన్ నడుపుతున్నాయి.

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆమె, మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది.

Tags: