కూటమి సర్కారు యేడాది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ - అలా ముందుకెళ్తున్నారు!

Update: 2025-06-12 07:34 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది గడిచింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై రివ్యూ చేస్తోంది. ప్రధానంగా సూపర్‌ సిక్స్‌ పేరిట ఏపీలో కూటమి పార్టీలు ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. వాటిలో చాలావరకు ఇంకా అమలు కాలేదు. ఇప్పుడు యేడాది పూర్తి కావడంతో సూపర్‌సిక్స్‌ హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో, యేడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది ఏపీ ప్రభుత్వం. తాము ఇచ్ఇన సూపర్‌ సిక్స్‌ హామీల్లో కీలకమైన త్లలికి వందనం పథకాన్ని ప్రారంభించింది.

ఇప్పుడైతే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే సూపర్‌సిక్స్‌లో కొన్ని పథకాలను అమలు చేస్తోంది. వాటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం, పోలవరం, రోడ్లకు మరమ్మతులతో పాటుగా సూపర్ సిక్స్‌లో భాగంగా వరుసగా పథకాలను అమలు చేస్తోంది. పింఛన్ లబ్దిదారులకు మొత్తాన్ని 4వేల రూపాయలకు పెంచారు.. డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు. పంచాయతీలకు నిధులు, గ్రామాలకు రోడ్లు, రైతులకు సాయం, ఉద్యోగాలు భర్తీ లాంటి అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలయ్యాయి. మొన్నటికి మొన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా మళ్లీ జోరందుకున్నాయి. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా రూ.990 కోట్ల నిధులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. యేడాది కాలంలోనే 4 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు.

ఇక, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువైన యేడాది కాలంలో 142 హామీలు నెరవేర్చినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రమాణ స్వీకారం చేసి యేడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వివరాలను మీడియా ముఖంగా వెల్లడించారు. నెరవేర్చిన 142 హామీల జాబితాలో ముందుగా నెరవేర్చిన సూపర్ సిక్స్ హామీ 4 వేలకు పెన్షన్ పెంపుతో ప్రారంభించి పంచాయతీ రాజ్ వ్యవస్థకు పూర్వవైభవం వరకూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం నెరవేర్చిన 142 హామీలను పరిశీలిస్తే.. పెన్షన్ పెంపు - రూ.4 వేలు, రేషన్ షాపుల్లోనే రేషన్, దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు- రూ.6 వేలు, కర్నూలులో హైకోర్టు బెంచ్, అన్నా క్యాంటీన్లు ప్రారంభం, పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌, మెగా డీఎస్సీ అమలు, మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్, పోలీసు శాఖలో 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ, వర్గీకరణ హామీ అమలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, గ్రీన్ టాక్స్ తగ్గింపు, చెత్త పన్ను రద్దు, భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ, నాలా పన్ను రద్దు, దీపం 2 పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు, పూర్ టు రిచ్ - పీ4, ఇప్పటికే లక్ష కుటుంబాలు దత్తత, ఉద్యోగుల బకాయిలు చెల్లింపు, తల్లికి వందనం- చదువుకునే ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు, 11 నెలల్లో 9.5లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5లక్షల ఉద్యోగాలకు ఒప్పందం, అన్నదాత సుఖీభవ- ప్రతి రైతుకి రూ.20 వేలు వంటివి ఇప్పటికే అమలు చేశామని చెప్పుకొచ్చారు. వీటితో పాటు.. డయాలసిస్ రోగులకు పెన్షన్ పెంపు-రూ.10వేలు, మంచానికే పరిమితమైన పెన్షన్ పెంపు రూ.15 వేలు, ఇంటికే వచ్చి ప్రభుత్వ అధికారులతో పెన్షన్, ఉద్యోగుల ఒకటో తేదీనే జీతాలు, టీచర్లకు మేలు చేసేలా రూ.117 జీవో రద్దు, రైతులకు రాయిత్ పై యంత్ర పరికరాలు, రాయితీ పై విత్తనాలు, రాయితీ పై ఎరువులు, రాయితీతో సోలార్ పంప్ సెట్లు, ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం, కౌలు రైతులకు కోపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు వంటివి కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీల జాబితాలో ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ప్రతి ఐటీడీఏలో ఉచిత డీఎస్సీ శిక్షణ కేంద్రం, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు ఫీడర్ అంబులెన్స్ లు, ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్ ల స్థానంలో ఒకటే యాప్, ఎస్పీ మహిళలకు రూ.3 లక్షల వరకు రాయితీ రుణాలు, బీసీలకు స్వయం ఉపాధి కోసం, 40% రాయితీతో, రూ.5 లక్షల వరకు రుణం, స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా ఖర్చు రూ.896 కోట్లు నిధులు విడుదల, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభం వంటి హామీలతో కూడిన ప్రకటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 13,218 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 20 వేలకు పైగా గ్రామీణ పేదలకు మినీ గోకులాలు నిర్మించారు. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో 20 వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాలో రూ.1.85 లక్షల కోట్లతో NTPC గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, శ్రీసిటీలో రూ.5 వేల కోట్లతో LG ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, రూ.65 వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో రూ.96,862 కోట్లతో BCPL రిఫైనరీ, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇలా భారీగా పెట్టుబడులు వచ్చాయి.

కేంద్రంలోని ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన భాగస్వామిగా ఉండటంతో కేంద్రం రాష్ట్రానికి సహాయం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,400 కోట్లు సాధించారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలకు కేంద్రం రూ.5 వేల కోట్లు ఇచ్చింది.విశాఖకు రైల్వే జోన్ మంజూరు చే యడంతో పాటు నిర్మాణ పనులు మొదలయ్యేలా చూసింది. రూ.72 వేల కోట్ల హైవే ప్రాజెక్టులు, రూ.70 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రూ.2245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరు చేసింది. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ నెలలోనే "అన్నదాత సుఖీభవ" పథకాన్ని కూడా అమలు చేయనున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి రానుంది. అంతేకాదు వాట్సప్‌ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 350 రకాల సేవలు అందిస్తున్నారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయించారు. పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవుల సొమ్ము విడుదల చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో టీసీఎస్‌తో ఒప్పందం చేసుకుని స్థలం కేటాయించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూములు కేటాయించారు. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఎలాగైనా 2029 నాటికి అమరావతి, పోలవరం ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. కేంద్రం సహకారంతో వచ్చే నాలుగేళ్లు అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి నిధుల సమస్య వెంటాడుతుండగా.. కేంద్రం సహకారంతో ముందుకు సాగుతామంటున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరో వైపు అభివృద్ధిని కొనసాగించాలంటే అంత ఆషామాషీ కాదు.. వచ్చే నాలుగేళ్లు ఎన్నో సవాళ్లు ఎదురవ్వడం ఖాయమనే చెప్పాలి. మరి చంద్రబాబు తనకు ఉన్న అనుభవంతో ఎలా డీల్ చేస్తారో చూడాలి.



Tags:    

Similar News