AP Residents from Nepal: నేపాల్ నుంచి ఏపీ వాసుల రవాణాపై లోకేశ్ సమీక్ష కొనసాగింపు
లోకేశ్ సమీక్ష కొనసాగింపు
AP Residents from Nepal: నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేశ్ రెండో రోజు సమీక్ష జరిపారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహచర మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్తో కలిసి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు.
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే కాఠ్మాండూ చేరుకుంది. ఈ విమానం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయాలకు చేరనుంది. కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులకు స్వాగతం పలకాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని కూడా ఆయన సూచించారు.