ఎస్వీబీసీ ఛానల్ నుంచి భారీగా ఉద్యోగులకు ఉద్వాసన...?

Update: 2025-05-31 09:54 GMT
  • ఛానల్ కి భారంగా మారిన ఉద్యోగులు...
  • నివేదిక అందించిన అధ్యయన బృందం
  • ప్రక్షాళన పై సమీక్షించిన చైర్మన్, ఈవో

వృధా ఖర్చుల తగ్గింపు పేరుతో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానల్ లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా మందికి ఉద్వాసన పలకాలని టీటీడీ పాలకమండలి భావిస్తోంది. ఈ మేరకు ఛానల్ లో నిధుల దుర్వినియోగం, ఉద్యోగుల వివరాలు, వారు నిర్వహిస్తున్న విధులపై అధ్యయనం చేయడానికి టీటీడీ ఒక కమిటీని నియమించింది. కమిటీ నివేదిక ప్రకారం ఎస్వీబీసీ భక్తి ఛానల్ లో అవసరానికి మించి భారీగా ఉద్యోగులను నియమించారని తేల్చారు. ప్రస్తుతం ఎస్వీబీసీలో 220 మంది ఉద్యోగులు ఉండగా అందులో కేవలం 60 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని కమిటీ నివేదికలో పేర్కొంది. మిగలిన 160 మంది ఉద్యోగులు వంటి పనీ పాట లేకుండా గడుపుతున్నారని అధ్యయన కమిటీ చెప్పింది. వీరిలో చాలా మందికి ఎందులోనూ అనుభవం లేదని వారికి కూడా వేలాది రూపాయలు చెల్లిస్తున్నట్లు అధ్యయన కమిటీ వివరించింది. ఒక్కొక్కరూ 30 వేల నుంచి 60 వేల రూపాయలు జీతం తీసుకుంటున్నట్లు తెలిపింది. భక్తులు వేసిన కానుకలు ఎస్వీబీసీలో వృధాగా ఖర్చు చేస్తున్నారని అవసరానికి మించి ఉన్న ఉద్యోగులు ఛానల్ కి తద్వారా టీటీడీకి గుది బండలా తయారయ్యారని ఛానల్ తక్షణం ప్రక్షాళణ చేయాల్సిన అవసరం ఉందని నిపుణల కమిటీ టీటీడీకి నివేదిక అందించింది. అధ్యయన కమిటీ అందించిన నివేదికలోని అంశాలను టీటీడీ బోర్డు అన్నమయ్య భవన్లో సమావేశమై సమీక్ష నిర్వహించారు.

టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, అదనపు అదనపు జేఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, నిపుణుల కమిటీ సభ్యులు శ్రీనివాసన్, పద్మావతి తదితర అధికారులు హాజరైన ఈ సమావేశంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంస్థను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్ది, భవిష్యత్తులో భక్తి ఛానళ్ళకు మార్గదర్శకంగా ఉండేలా రూపురేఖలు మార్చేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించారు. కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్వాలిటీ లేని కార్యక్రమాలతో భక్తులను సరైన రీతిలో ఆకట్టుకోలేక పోతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్వీబీసీ ఛానల్ ను గాడిలో పెట్టేందుకు ప్రత్యేకంగా అనుభవజ్ఞులు నిపుణుల చేత విచారణ జరిపి వారు అందించిన నివేదిక ప్రకారం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.

హైదరాబాదు నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం. మూడు రోజులపాటు తిరుపతి, తిరుమలలో ప్రత్యేకంగా ఎస్ వి బి సి కార్యక్రమాలపై లోతుగా పరిశీలన చేసింది. ఈ ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు, పరిపాలన వ్యవహారాలు, సిబ్బంది పనితీరు, కార్యక్రమాల రూపకల్పన, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో నాణ్యత, భక్తి కార్యక్రమాల పేరుతో ఖర్చు చేస్తున్న నిధుల సద్వినియోగం, సిబ్బంది విధి నిర్వహణ తీరు వ్యవహారాలు, తదితర అంశాలపై ఈ అధ్యయన కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అనంతరం శనివారం కమిటీ సభ్యులు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడుకు పూర్తి వివరాలతో నివేదికను అందజేశారు.

అధ్యయన కమిటీ అందించిన నివేదిక ప్రకారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపు రేఖలను మార్చడంతో పాటు జాతీయస్థాయిలో ఛానల్ కు గుర్తింపు తీసుకొచ్చి, నిధుల వినియోగంలో దుర్వినియోగాన్ని అరికట్టి, ప్రభుత్వం నుంచి ఛానల్ నిర్వహణ కోసం అనుభవం కలిగిన పర్యవేక్షకులను నియమించేలా టిటిడి బోర్డు కీలకమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.

Tags:    

Similar News