Amaravait Lands : ప్రణాళికలే కాదు పనుల, ఫలితాలు కూడా కనిపించాలి
రాజధాని నిర్మాణాలపై సీయం చంద్రబాబు సమీక్ష;
- భూములు పొందిన సంస్థలకు అనుమతుల్లో జాప్యం ఉండదు
- రాజధానిలో భూ కేటాయింపులు జరిపిన సంస్థల ప్రతినిధులతో సీయం సమావేశం
- అదనంగా భూమి కావాలన్న వివిధ సంస్థల ప్రతినిధులు
రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికే తమ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సీఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రైవేటు కార్పోరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో నిర్మాణ ప్రగతి పై ముఖ్యమంత్రి చర్చించారు. భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులతో కలిసి ఈ తరహా సమావేశం తొలిసారి నిర్వహించారు. భూములు తీసుకున్న 61 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులు కొందరు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు ఎప్పటిలోగా తమ నిర్మాణాలను పూర్తి చేస్తారనే అంశంతో పాటు...నిర్మాణాలకు సంబంధించి వారి వద్ద ఉన్న ప్రణాళికల పైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు.
భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ. అమరావతి నగరాన్ని ఓ ప్రత్యేక ప్రాంతంగా.. ప్రణాళికాబద్దంగా తీర్చిదిద్దుతున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఇది రోటీన్ సిటీలా ఉండదు. హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులో ఉండేలా నగరాన్ని అభివృద్ధి చేయనున్నాం. ఏఐ క్వాంటమ్ వ్యాలీ వంటి వాటితో అమరావతి భవిష్యత్ నగరంగా మారుతుంది. దీని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. అమరావతి నగర నిర్మాణంలో భూములు తీసుకున్న సంస్థలు కూడా ఇందులో భాగస్వాములే. ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థలు.. కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి. అమరావతి నగర నిర్మాణంలో భూములు తీసుకున్న మీకు ఇప్పుడు చాలా అంశాలు కలిసి వస్తాయి. గ్రీన్, బ్లూ సిటీగా అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశాం. జీరో ఎమిషన్ సిటీగా అమరావతి ఉండబోతోంది. ఎలక్ట్రిక్ వాహానాలకు రాజధానిలో పెద్ద పీట వేస్తాం.” అని చంద్రబాబు చెప్పారు.
భూములు తీసుకున్న ప్రాంతాల్లో ఆయా సంస్థలు ఎప్పటి నుంచి తమ పనులు ప్రారంభించనున్నాయో అనే అంశంపై ఆయా కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు. ఎప్పటిలోగా నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఎప్పటిలోగా భవనాలు పూర్తి అవుతాయనే అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా రాజధానిలో భూములు తీసుకున్న సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. భూములు తీసుకున్న వారు చెప్పిన విధంగా నిర్మాణాలు మొదలు పెట్టాలి. చెప్పిన విధంగా నిర్మాణాలు పూర్తి చేయాలి. ఇప్పుడు భూములు తీసుకున్న వారు తమ పూర్తి స్థాయి నిర్మాణాలను రెండున్నరేళ్లు. మూడేళ్లల్లో పూర్తి చేయాలి. నిర్దేశించిన లక్ష్యానికి మించి ఒక్క రోజు కూడా జాప్యం కాకూడదు. నిర్మాణాల విషయంలో మీకు ఎలాంటి అనుమతులు కావాలన్నా జాప్యం లేకుండా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. సింగిల్ విండో సిస్టం ద్వారా పర్మిషన్లు ఇస్తాం. అధికారుల వైపు నుంచి ఏమైనా ఆలస్యం జరిగితే నేరుగా నన్ను వచ్చి కలవొచ్చు. మీరు కట్టబోయే నిర్మాణాలు కూడా రోటీన్ పద్దతిలో కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలా మాస్టర్ ప్లాన్లు రూపొందించుకోవాలని కోరుతున్నా. మీరు చేపట్టబోయే నిర్మాణాలతో అమరావతి శోభ మరింతగా పెరగాలి. ప్రతి నిర్మాణమూ కార్పోరేట్ లుక్ ఉండాలని చంద్రబాబు సూచించారు. భూములు తీసుకున్న సంస్థలు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టడంతోపాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని సీయం సూచించారు. వివిధ ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించే సంస్థలకు కేంద్రంగా అమరావతిని ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై మీ సలహాలు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.