పీవీఎన్ మాధవ్ కుటుంబం అరుదైన రికార్డు
ఎమ్మెల్సీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన తండ్రీ కొడుకులు;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న పోకల వంశీ నాగేంద్ర మాధవ్ కుటుంబానికి ఏపీ రాయజకీయాల్లో ఒక ఆరుదైన రికార్డు ఉంది. తండ్రీ, తనయులు ఇద్దరు శాసనమండలి సభ్యులుగా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించిన ఘనత పోకల కుటుంబం సాధించింది. త్వరలో భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న పీవీఎన్ మాధవ్ తండ్రి పీవీ చలపతి రావు కూడా బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే గతంలో 2017లో మాధవ్ ఎమ్మెల్సీగా గెలుపొందిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచే ఆయన తండ్రి చలపతిరావు కూడా ఎమ్మెల్సీగా గెలుపొందారు.
పీవీ చలపతిరావు 1945వ సంవత్సరంలో తన పది సంవత్సరాల వయసులోనే బాల స్వయం సేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్లో చేరారు. 1948వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసినప్పుడు పన్నెండు సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు సమాచారం సారధిగా వ్యవహరించారు. 1974లో ఉత్తర సర్కార్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా తొలిసారి గెలుపొందారు. తరువాత 1980వ సంత్సరంలో జరిగిన పట్టభద్రుల శాసనమండలి స్ధానాల ఎన్నికలో తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది… 1986లో శాసనమండలి రద్దు చేసేంత వరకూ కొనసాగారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి 1980వ సంవత్సరం నుంచి 1986 వరకూ ఆంధ్రప్రదేశ్ శాఖకి మొట్టమొదటి బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
పీవీచలపతి రావు తరువాత ఆయన కుమారుడు పీవీఎన్ మాధవ్ భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతూ 2017లో తండ్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన అదే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజవకర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొంది తండ్రి అడుగుజాడల్లో నడిచారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎంపికవ్వడంతో తండ్రి నిర్వర్తించిన పార్టీ బాధ్యతలను కుమారుడు కూడా కొనసాగించినట్లు అయ్యింది.