కొమ్మినేని అరెస్టుపై సీనియర్ సంపాదకుల ఆగ్రహం
Senior editors express anger over Kommineni's arrest;
పత్రికాస్వేచ్ఛపై దాడి ప్రజాస్వామ్యానికి చేటు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటినుంచీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే శక్తులు ఉంటూనే వస్తున్నాయని, అయితే వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయని అభిప్రాయ పడ్డారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్క్లబ్లో 'డెమోక్రసీ-ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్' అనే అంశంపై రౌండ్టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ రౌండ్టేబుల్ సమావేశంలో రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కే.శ్రీనివాస్, దేవుల పల్లి అమర్, దిలీప్రెడ్డి, విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. పత్రికారంగంపైనా, జర్నలిస్టులపైనా దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించారు.
సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ ఈ రెండు ప్రశ్నార్థకాలే అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు కాంట్రవర్సీగా మాట్లాడే వ్యక్తి కాదని, ఏదో కారణాన్ని అడ్డు పెట్టుకొని సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం సరికాదన్నారు. మరో సీనియర్ ఎడిటర్ టంకశాల అశోక్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పత్రిక స్వేచ్చను కాపాడాలని అభిప్రాయపడ్డారు. కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతోనే ప్రభుత్వ ఉద్దేశ్యం అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు ఒక్క పత్రిక స్వేచ్ఛ విషయంలోనే కాదు ప్రజలకు గౌరవం ఏ విషయంలోనూ ఇవ్వరని, అన్ని స్వేచ్ఛలు భంగపడుతున్నాయని, అందులో మీడియా స్వేచ్ఛ కూడా ఉందన్నారు.