ఏపీలో సిల్వర్‌ స్క్రీన్స్‌ హైడ్రామా!

Update: 2025-05-27 06:58 GMT

ఏపీలో సిల్వర్‌ స్క్రీన్స్‌ వ్యవహారంలో ఇంట్రస్టింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కామెడీతో పాటు స్టోరీ.. స్క్రీన్‌ ప్లే.. సాగదీత.. డైరెక్షన్ ఇలా.. రాష్ట్ర రాజకీయాల్లో కావాల్సినంత సినిమా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా తయారయ్యింది. ఎవరైనా సమ్మెకు ఎప్పుడైనా దిగే అవకాశం కనిపిస్తోందంటున్నారు. అయితే, అది తమ నేతకు సంబంధించిన సినిమా విడుదలయినప్పుడే ఈ థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఏంటన్న ప్రశ్న మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంది.



పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెల 12వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా జూన్ ఒకటోతేదీ నుంచి సమ్మెకు దిగాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. నిజానికి జనాలు రాకపోవడం వల్లే థియేటర్లకు నష్టం వస్తోంది. మరి..అసలు కారణాన్ని వదిలి.. జనం సినిమాలకు ఎందుకు రావడం లేదన్న టాపిక్‌పై ఎగ్జిబిటర్లు ఇంత వరకూ దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. సినిమాకు వెళ్తే టిక్కెట్ రేట్లు వందల రూపాయలు ఉన్నాయి. అంతకు మించి చిరుతిళ్ల ధరలు మండిపోతున్నాయి. దీంతో, ఒక చిన్న ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలన్నా.. కనీసం రెండువేల రూపాయల దాకా సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. పాప్ కార్న్ నాలుగు వందల రూపాయలా? సమోసా రెండు నూట నలభై రూపాయలా? ఈ రేట్లు బయటతో పోల్చితే.. ఇంత అబ్ నార్మల్‌గా ఉన్నప్పటికీ ప్రభుత్వం కానీ, సంబంధిత డిపార్ట్‌మెంట్ల అధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు.. ఓటీటీలు కూడా ఈ పరిస్థితులకు మరో ప్రధాన కారణం. సినిమా విడుదలయ్యాక నెలా, రెండు నెలల్లోనే ఆ సినిమాలు ఓటీటీల్లోకి వస్తుండటంతో.. జనం ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒక్కరోజు సినిమాకు 2నుంచి 3వేల దాకా ఖర్చు పెట్టడం, వ్యయ ప్రయాసలకు గురి కావడం కంటే.. ఇంట్లోనే ఉన్న స్మార్ట్‌ టీవీలో ఎంచక్కా ఫ్రీగా సినిమా ఎంజాయ్‌ చేయొచ్చనుకుంటున్నారు.



మరోవైపు.. ఇప్పుడు థియేటర్లు, ఎగ్జిబిటర్ల నిర్ణయంతో ఇటు జనసేన అటు వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎగ్జిబిటర్లు తమకున్న సమస్యలను చెప్పుకునే వీలుంది. అలాగే, వాటిని పరిష్కరించాల్సింది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. అందుకే వారు తమ ప్లాట్ ఫారంలో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కేవలం థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంటే పవన్ కల్యాణ్ సినిమాను దెబ్బ కొట్టినంత మాత్రాన నష్టపోయేది థియేటర్ల యజమానులే. ఆ విషయం వారికి కూడా తెలుసు. కానీ, ఇది అటు ఇటు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై పవన్ కల్యాణ్ కార్యాలయం స్పందించడంతో వివాదం మరింత జఠిలమయింది. తాము వ్యాపారాలు చేసుకునే వారమని, ప్రభుత్వంతో ఏం సంబంధమని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. కానీ, అదే సమయంలో జనసేన నేతలు కూడా గతంలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం హయాంలో తన సినిమా విడుదల చేసిన సమయంలో చేసిన కామెంట్లతో కూడిన వీడియోలను విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏముందని నాడు ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎందుకు కలవలేదంటూ సినీ పెద్దలను ప్రశ్నించడం ద్వారా కొంత నాలుక మడత వేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక చర్చలు జరపడానికి తాము సిద్ధమంటూ ప్రభుత్వం ప్రకటించినా ఎగ్జిబిటర్లు మాత్రం తమ సమస్య ప్రభుత్వం వద్ద లేదని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దనే ఉందని చెబుతున్నారు. ఈ థియేటర్ల బంద్ మొదలయ్యే అవకాశం పెద్దగా లేకపోయినా ఏపీ రాజకీయాలు మాత్రం ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ చుట్టూనే తిరుగుతున్నాయి.


Tags:    

Similar News