తెలుగుదేశంలో కోవర్టుల కలకలం
తెలుగుదేశం పార్టీలో అనుమానపు నీడలు కమ్ముకున్నాయి. పార్టీలో ఏ స్ధాయిలో ఎవరు చేరినా వారిని అనుమానపు చూపులు చూస్తున్నారు. టీడీపీలో చేరిన వ్యక్తి ఒక వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు ఏమో అనే అనుమానం టీడీపీ అధిష్టానాన్ని ఇబ్బందిపెడుతోంది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో కోవర్టులు చేరుతున్నారన్న ప్రచారంతో ఆ పార్టీ అప్రమత్తమయింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరుతున్నారు. వీరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని.. టీడీపీలో చేరి.. టీడీపీ కార్యకర్తలుగా మారి.. టీడీపీ నేతలను హత్యలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు ఇటీవల టీడీపీ కార్యకర్తల హత్యల విషయంలో ఇదే జరిగిందని పార్టీ ప్లీనరీలో చెప్పారు. కోవర్టులు ఉన్నారని వారిని ఏరివేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం చేరికలపై ఆంక్షలు విధించింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీల్లోకి పెద్ద ఎత్తున వలసలు వస్తాయి. ప్రతీ సారి ఇదే సమస్య ఉంటుంది. ఈ సారి మూడు పార్టీల కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. వైసీపీ పూర్తి గా సమస్యల్లో పడటం,ద్వితీయ శ్రేణి నాయకులు తమ అవసరాల కోసం ఈ మూడు పార్టీల్లో ఒక దాంట్లో చేరేందుకు ప్రయత్నించడం కామన్ గా మారిపోయింది.
జిల్లా స్థాయి నేతల చేరికల విషయంలో మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటున్నాయని చెబుతున్నారు. అయితే కింది స్థాయి .. గ్రామ స్థాయి క్యాడర్ విషయంలో మాత్రం పార్టీ నేతలు స్వచ్చగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అలా చేరుతున్న వారిలో కోవర్టులు, నేరగాళ్లు ఉండటం ఆ పార్టీకి సమస్యగా మారింది. కోవర్టుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు స్పష్టమైన సమాచారం ఉండటంతో పలుమార్లు పార్టీ వేదికలపై సూటిగానే హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వారి అవకాశాలను కొట్టేయడానికి చాలా మంది చేరుతున్నారని అనుమానిస్తున్నారు. చంద్రబాబు నేరుగా హెచ్చరించినా కోవర్టుల చేరికలు ఆగకపోవడంతో అధికారికంగా సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు. ఇక ముందు నుంచి ఎవరూ టీడీపీలో చేరాలన్నా పార్టీ హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో అవకాశాల కోసం చాలా మంది ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి వస్తున్నారు. మాచర్లలో జరిగిన టీడీపీ నేతల జంట హత్యల వెనుక ఇలా అవకాశాల కోసం వచ్చిన వారే ఉన్నారని.. వారు తమ అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి టీడీపీలో ఉన్న వారిని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారు అంతకు ముందు వైసీపీలో ఉండేవారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం.. చేరికలు ఆపేయడమేనని నర్ణయానికి వచ్చారు.
ఒకటి, రెండు సార్లు ఆలోచించుకోవాలి
టిడిపిలో చేరాలనుకునే వారికి షరతులు వర్తిస్తాయి అంటోంది ఆ పార్టీ హై కమాండ్. చేరికల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.' టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీ నాయకులను టిడిపిలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. వారి గురించి పూర్తిగా కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించగలరు' అంటూ మంగళగిరి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాల దృష్ట్యా హై కమాండ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందిగత మాదిరిగా పార్టీలో చేరాలనుకునే వారికి చేర్చుకుంటామంటే కుదరదు. కచ్చితంగా కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే టిడిపిలో చేరికలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు అధికార పార్టీలోకి వచ్చారు. అయితే వీరిలో కొందరు కోవర్టులు ఉన్నారని సీఎం చంద్రబాబు స్వయంగా కడప మహానాడు వేదికగా కామెంట్ చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. కొవ్వొత్తులను పార్టీలోకి పంపాలనుకుంటే ఆటలు సాగవని.. వలస పక్షులు వస్తాయి.. పోతాయి అంటూ కామెంట్స్ చేశారు. కొవ్వొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొదటినుంచి జండా మోసిన వారిని కాదని కొత్తగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని హై కమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. ఈ పరిస్థితుల్లోనే హై కమాండ్ ఈ ప్రత్యేక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ శ్రేణులకు మరోసారి అల్టిమేటం ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు పార్టీలు ఏకకాలంలో ఈ ప్రకటన చేయడంపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికతోనే ఈ రెండు పార్టీలు అలాంటి ప్రకటన చేసి ఉంటాయని అనుమానాలు వస్తున్నాయి.