టాలీవుడ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌కు థాంక్స్‌ - డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Update: 2025-05-24 12:47 GMT

తెలుగు సినిమా రంగం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి, అగ్ర సినీ నటుడు పవన్‌ కల్యాణ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది గడుస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన వారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారని గుర్తు చేశారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదని, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని చెప్పారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.



ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ తెలిపారు. సినిమా రంగం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలంటే.. ఇక మీదట వ్యక్తిగత చర్చలకు తావు ఉండదని, సంబంధిత సంఘాల ప్రతినిధులే రావాలని ఆయన స్పష్టం చేశారు.



తెలుగు చిత్రసీమ గతంలో ఎదుర్కొన్న అన్యాయాలను మరచిపోకూడదని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని కక్ష సాధింపులకు గురి చేసిందని, అగ్రనటులను అవమానించిన పాత ఘటనలను సినీ సంఘాలు గుర్తుంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం మాత్రం వ్యక్తులను కాకుండా, సినిమా రంగ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తోందని స్పష్టం చేశారు.



తెలుగు చిత్రసీమ నుంచి కొంతమంది నిర్మాతలు వ్యక్తిగతంగా టిక్కెట్ ధరల పెంపు కోసం విజ్ఞప్తులు చేస్తున్నా, సమగ్రంగా సినీ రంగ అభివృద్ధికి ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరగాలని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గతంలో దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని లాంటి ప్రముఖులతో సమావేశం కాకుండా.. పరిశ్రమగా ఎదగాలంటే సంఘటితంగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు.



ఈ సందర్భంగా సినీ రంగ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. థియేటర్లను లీజుదారులు నడుపుతున్నారని అధికారులు చెప్పగా, వాటికి సంబంధించిన పన్నులు సక్రమంగా వస్తున్నాయా అనే అంశాన్ని పరిశీలించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులపై స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షణ సాగించాలన్నారు. తినుబండారాలు, పానీయాల ధరలు అధికంగా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదులపై తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా తనిఖీలు చేయించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.



మరోవైపు.. మల్టీప్లెక్స్ హాళ్లపై కూడా దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచించారు. టికెట్ ధరలు, ఫుడ్‌ ఐటెమ్స్‌ ధరలు, పారిశుధ్యం తదితర అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి నగరాల్లో మల్టీప్లెక్స్‌ల నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.



కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ రూపకల్పన దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా రూపకల్పన నుంచి ప్రదర్శన వరకు ఉన్న 24 విభాగాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ శిబిరాలు, సెమినార్లు, సింపోజియమ్స్ నిర్వహించనున్నారు. పరిశ్రమగా అభివృద్ధి చెందాలంటే గుత్తాధిపత్యం కాకుండా ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.



ఈ మొత్తం ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి, త్వరలో సినిమా రంగం అభివృద్ధికి కాంప్రహెన్సివ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించనుందన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.




Tags:    

Similar News