షార్ లో తీవ్రవాదులు ఉన్నారంటూ అగంతకుడి ఫోన్
అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు;
శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరీక్ష పరిశోధనా కేంద్రానికి బెదిరింపు కాల్ వచ్చింది. షార్ లో తీవ్రవాదులు ఉన్నారని ఓ అగంతకుడు అర్ధరాత్రి చెన్నైలోని సీఐఎస్ఎఫ్ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సమాచారాన్ని శ్రీహరికోట అంతరీక్ష పరిశోధనా కేంద్రానికి విషయం చేరవేశారు. చెన్నై పోలీసుల సమాచారంతో ఉలిక్కపడ్డ భద్రతా వ్యవస్ధ షార్ సెంటర్ ను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లా పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి తెల్లవారు జాము నుంచి షార్ పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. షార్ ని అనుకుని ఉన్న అడవుల్లో సీఐఎస్ఎఫ్ బలగాలు బృందాలుగా విడిపోయి కూబింగ్ కూడా నిర్వహించాయి. అలాగే సముద్ర తీర ప్రాంతంలో కోస్టల్ గార్డులు తనిఖీలు నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు నేతృత్వంలో పోలీసులు షార్ మొదటి గేటు, ఉద్యోగుల కాలనీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అకస్మాత్తుగా పోలీసులు ఈ విధంగా తనిఖీలు చేస్తుండటంతో షార్ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, అధికారులు ప్రాథమిక విచారణ అనంతరం ఇది ఫేక్ కాల్గా నిర్ధారించారు. కాల్ ఎవరు చేశారు? ఎక్కడ నుంచి చేశారు అనే విషయాలను చెన్నై పోలీసుల సహకారంతో నెల్లూరు పోలీసులు విచారిస్తున్నారు.