యోగ యజ్ఞాన్ని విజయవంతం చేయాలి
మంత్రి సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి;
ప్రధాని నరేంద్ర మోడీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసి పదకొండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల పాటు యోగా యజ్ఞాన్ని నిర్వహించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. నెల రోజు పాటు నిర్వహించిన యోగా యజ్ఞం రేపు విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ అతిథిగా పాల్గొనే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. విశాఖలో జరిగే యాగాంధ్ర కార్యక్రమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు అందరూ భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజవంతం చేయాలని మంత్రి కోరారు.
యోగాభ్యాసం వలన ప్రజారోగ్యానికి కలిగే బహుళార్ధ ప్రయోజనాలను తెలియజేస్తూ ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించటానికి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ వేడకలకు ప్రధాన వేదిక అయిన మన రాష్ట్రం ప్రజల భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి ఆలోచనలు మేరకు పలు రికార్డులు నెలకొల్పేలా గత నెల రోజులుగా ప్రజల్లో చైతన్యం కల్పించటానికి కృషి జరిగిందని మంత్రి తెలిపారు.ఈ ప్రయత్నం తప్పక విజయం సాధిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా ప్రధాన కార్యక్రమం విశాఖపట్నం బీచ్ నుండి భీమునిపట్నం బీచ్ వరకు 5 లక్షల మంది యోగాభిలాషులతో శనివారం జూన్ 21 నాడు జరగనుంది. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని మంత్రి సత్యకుమార్ వివరించారు. గత నెల రోజులుగా యోగ విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని వివిధ స్థాయిల్లో యోగకు సంబంధించి పలు పోటీలు, జిల్లాకు ఒక ఇతివృత్తం ఆధారంగా యోగ కార్యక్రమాలు ,వంద ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలలో యోగ ప్రదర్శనలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ప్రజల్లో యోగా పట్ల చైతన్యం కల్గించటానికి నెల రోజులుగా వివిధ స్థాయిల్లో కృషి చేసిన అధికారులుకు, ముఖ్యమంత్రి పిలుపుకు విశేషంగా స్పందించిన యోగాభిలాషులుకు మంత్రి సత్యకుమార్ అభినందనలు తెలిపారు.