రానున్న రెండు రోజుల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ఉత్తర కర్ణాటక అంతర్భాగంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉన్నట్లు ఆంద్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్ధ పేర్కొంది. అలాగే పశ్చి మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిషా తీరం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ చెపుతోంది. పలు ప్రాంతాల్లో పిడులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ధ వెల్లడించింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఇక జూన్ 15వ తేదీ ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతరామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్ధ పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లు, టవర్లు, పోల్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దని హెచ్చరించింది. అదేవిధంగా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగులు, చెట్ల కింద, శిధిలావస్ధలో ఉన్న గోడలు, భవనాల పక్కన నిలబడవద్దని విపత్తు నిర్వహణ సంస్ధ సూచిస్తోంది.