Trending News

Vijayasai Reddy: మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికే అన్ని వివరాలు తెలుసు: ఈడీకి విజయసాయి వెల్లడి

ఈడీకి విజయసాయి వెల్లడి

Update: 2026-01-23 08:49 GMT

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియా అంతా రాజ్ కెసిరెడ్డే అని ఆయన స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం గురించి అన్ని వివరాలు రాజ్ కెసిరెడ్డికే తెలుసని, ఆయనే దీనికి పూర్తి బాధ్యుడని విజయసాయిరెడ్డి తన వాంగ్మూలంలో తెలిపారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

మద్యం కుంభకోణం జరిగిందా అని ఈడీ అడిగింది

ఈడీ అధికారులు మద్యం కుంభకోణం జరిగిందా అని ప్రశ్నించగా, అది తనకు తెలియదని, ప్రమేయం ఉన్నవారే సమాధానం చెబుతారని విజయసాయిరెడ్డి సమాధానమిచ్చారు. వైకాపాలో నంబర్ 2గా ఉండి తెలియదనడం సరికాదేమో అని విలేకర్లు అడగ్గా, జగన్‌మోహన్‌రెడ్డే పార్టీలో నంబర్ 2 ఎవరూ ఉండరని ఆయన గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం వరకు తనకు నంబర్ 2 స్థానం ఇచ్చారని, అనంతరం కోటరీ (సజ్జల శ్రీధర్‌రెడ్డి) ప్రభావంతో 2020 నుంచి తనను క్రమంగా పక్కనపెట్టారని వివరించారు.

సజ్జలకు రూ.100 కోట్ల సర్దుబాటు

వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి సూచన మేరకు సజ్జల శ్రీధర్‌రెడ్డికి రూ.100 కోట్లు సర్దుబాటు చేయించిన విషయాన్ని ఈడీకి చెప్పానని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే, ఈ కేసులో అప్రూవర్‌గా మారనని, అలాంటి అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

మద్యం పాలసీలో తన పాత్ర లేదు

మద్యం పాలసీ రూపకల్పనలో తన పాత్ర ఏమీ లేదని, ఆయన అల్లుడిదిగా చెబుతున్న డిస్టిలరీ సంస్థకు కాంట్రాక్టులు నిబంధనల ప్రకారమే ఇచ్చారని విజయసాయిరెడ్డి వాదించారు. తన ఆస్తుల వివరాలన్నీ ఇవ్వడానికి సిద్ధమని, అరబిందో వాళ్ల ఆస్తులు తనవి కావని చెప్పారు. జగన్ తనపై వందల కోట్లు దోచేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని పేర్కొన్నారు.

కొత్త రాజకీయ ప్రస్థానం

ఈ నెల 25వ తేదీన తాను వైకాపాకు రాజీనామా చేసి ఏడాది పూర్తవుతుందని, ఆ తర్వాత కొత్త రాజకీయ ప్రస్థానం మొదలుపెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తనపై దుష్ప్రచారం చేసేవారికి బుద్ధి చెబుతానని, అధికారం శాశ్వతం కాదని హితవు పలికారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లపాటు జగన్‌కు పాలేరులా పనిచేశానని, కోటరీ పుణ్యమాని బయటకు వచ్చానని, వారిని నమ్ముకున్నంత కాలం జగన్ అధికారంలోకి రావడం అసాధ్యమని అన్నారు.

ఈడీ విచారణలో ఆయన మరోసారి హాజరు కావచ్చని సమాచారం.

Tags:    

Similar News