YSsahrmila : వైసీపీపై కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాలపై ఎందుకు చూపిస్తున్నారు
కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల;
వైఎస్ఆర్సీపీపై ఉన్న కోపాన్ని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ విగ్రహాలపై చూపిస్తోందని ఆంధ్రప్రదేశ్ పిసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ విగ్రహాలపై కక్షపూరిత రాజకీయాలు చేస్తారా అని షర్మిల నిలదీశారు. నందిగామ గాంధీ సెంటర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం దుర్మగమైన చర్య అని ఆమె అన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం దిగజారుడు తనానికి ఇది నిదర్శనమన్నారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజానాయకుడు వైఎస్ఆర్ అని అటువంటి నాయకుడి విగ్రహాలను తొలగిస్తారా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్కీ సంబందం ఏంటని షర్మిల ప్రశ్నించారు. మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ ఏమైనా వారి సొత్తా లేక పేటేంటా అని నిలదీసారు. వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ వేసుకున్న సెట్టింగులు తొలగించుకోండి. మాకేం అభ్యంతరం లేదు కానీ ఇదే సాకుగా చూపి వైఎస్ఆర్ విగ్రహాల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. తొలగించిన చోట వెంటనే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని లేకుంటే ఉద్యమం తప్పదని వైఎస్.షర్మిల తీవ్రంగా హెచ్చరించారు.