Y. S. Jagan Mohan Reddy: రాజధాని విషయంలో జగన్ కొత్త ట్విస్ట్.. అమరావతికి బదులు విజయవాడ-మచిలీపట్నం-గుంటూరు ‘ప్లాన్ బీ’ ప్రతిపాదన
అమరావతికి బదులు విజయవాడ-మచిలీపట్నం-గుంటూరు ‘ప్లాన్ బీ’ ప్రతిపాదన
Y. S. Jagan Mohan Reddy: రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతి రాజధాని బదులు కొత్త ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని ఆయన స్పష్టమైన ప్రతిపాదన చేశారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాజధానికి ‘ప్లాన్ బీ’ పేరుతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను రాజధానిగా మార్చాలని జగన్ సూచించారు. “మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 70 కి.మీ., విజయవాడ నుంచి గుంటూరు వరకు 40 కి.మీ. దూరం ఉంది. ఈ మూడు నగరాల మధ్య మొత్తం 110 కి.మీ. హైవే ఉంది. ఈ ప్రాంతాన్ని ‘మావిగన్’ పేరుతో రాజధాని ప్రాంతంగా ప్రకటించండి. ఆ పేరు వింటే నన్ను గుర్తుచేసుకుంటారని అనుకుంటే మరో పేరు పెట్టండి” అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇది రాజధాని వివాదానికి జగన్ తన వైపు నుంచి కొత్త మలుపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.