రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన యోగాంధ్ర
వన్ ఎర్త్… వన్ హెల్త్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గడచిన నెల రోజులగా యోగాంధ్ర పేరుతో కూటమి సర్కిర్ నిర్వహిస్తున్న యోగా ప్రదర్శనలు శనివారంతో ముగిసాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ సముద్రం ఒడ్డున 28 కిలో మీటర్ల మేర అత్యంత అట్టహాసంగా నిర్వహించిన అతిపెద్ద యోగా ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాలు పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతుల నడుమ లక్షలాది మంది శనివారం ఉదయమే యోగసనాలు వేశారు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఈ యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఏక కాలంలో ఒక ప్రాంతంలో ఇంత మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు కాబట్టి ఈ కార్యక్రమన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేశారు. ఇలా ఒకే సారి 3లక్షల మంది యోగాసనాలు వేయడం ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. గతంలో సూరత్ లో లక్షన్నర మంది ఏక కాలంలో యోగసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం సురత్ రికార్డ్ ను అధిగమించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం దక్కించుకుంది. ఇదే కాకుండా యోగాలో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు సూర్య నామస్కారాలు చేసి రికార్డ్ నెలకొల్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి 106పాఠశాలలకు చెందిన 22వేల మంది విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిన్న శుక్రవారం ఒకే సారి 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు. ఇలా 22వేల మంది ఏకకాలంలో 108 నిమిషాలలో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడాన్ని వరల్డ్ రికార్డుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది.