సొంత పార్టీ నాయకుల నుంచే వైఎస్.షర్మిళకు సెగ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిళకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేక సెగ తగులుతోంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి షర్మిళ వ్యవహార శైలి పార్టీలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ఎవరికీ నచ్చడం లేదు. అసలే ప్రజాస్వామ్యం అవసారిని మించి అనుభవించే కాంగ్రెస్ నాయకులకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఒంటెత్తు పోకడలు అస్సలు నచ్చడం లేదు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది... అలాంటిది ఒక ప్రాంతీయ పార్టీ అధినేతలా షర్మిల వ్యవహరించడం పార్టీ నాయకులకు నచ్చడం లేదు. అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలనుకోవడంతో షర్మిళకు సొంత పార్టీలోనే శత్రువులు పెరిగిపోతున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఒక అజెండా సెట్ చేసుకుని వైఎస్.షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె పోకడలు చూస్తేనే అర్ధమవుతోందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానికి వైఎస్.జగన్ మోహనరెడ్డికి ముడిపెడుతూ విమర్శలు చేయడం వల్ల పార్టీ ప్రజల్లో మరింత చులకన అవుతోందని కాంగ్రెస్ సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. కేవలం వైసీపీని, జగన్ని, ఆ పార్టీ నేతలను విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి.
పీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం వదిలేసి అధికారంలోని లేని పార్టీపై విమర్శలు చేయడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరింత ఓటు బ్యాంకు కోల్పోయే ప్రమాదముందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఆంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు విమ్శలు చేస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ అధికారంలో లేనప్పుడు కూడా విమర్శలు చేయడం, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నట్లు కాదా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. కూటమితో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారన్నవిషయాన్ని వైఎస్ షర్మిల గమనిస్తున్నారా? అని వారు నిలదీస్తున్నారు. జగన్ ను ఇప్పుడు తిట్టిపోసినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుందని, బీజేపీతో కలసి నడుస్తున్న టీడీపీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితుల్లో కేవలం జగన్ ను ఆ పార్టీ నేతలను టార్గెట్ చేయడం వైఎస్ షర్మిల అజెండా ఏంటో స్పష్టంగా తెలుస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు.
ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ షర్మిల వ్యవహారశైలితో మరింత దిగజారిపోయే అవకాశముందన్న హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎందరో పీసీసీ చీఫ్ లు ఉన్నప్పటికీ ఇలా వ్యవహరించలేదని, వైఎస్ బిడ్డగా జనంలోకి వచ్చిన షర్మిల రాజకీయం చేయడం మానేసి కుటుంబ సభ్యులపై కసి తీర్చుకోవడానికి పదవిని అడ్డంపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు హస్తం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఏమీ లేని చోట ఏం చర్యలు తీసుకుంటామన్న ధోరణిలో ఉన్నారు. ఇటీవల షర్మిలపై సుంకర పద్మశ్రీ సమరాన్ని చేపట్టారు. షర్మిలకు కుటుంబ తగాదాలే తప్ప పార్టీ పట్టలేదని జిల్లాలు తిరిగి ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ మెంబర్ గా ఉన్న సుంకర పద్మశ్రీ జిల్లాల్లో పర్యటిస్తూ వైఎస్ షర్మిల కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నుంచి సంతకాలను కూడా సేకరిస్తున్నారు. కూటమి అందించిన స్క్రిప్టు ను చదువుతూ షర్మిల విమర్శలు చేస్తున్నారని, అధికార పార్టీని ప్రశ్నిచకుండా ప్రతి పక్ష పార్టీని ప్రశ్నించడమేంటని సుంకర పద్మశ్రీ నిలదీస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల మాత్రం వీటిని కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. తాను అనుకున్నట్లుగానే పార్టీని నడపాలన్న ఉద్దేశ్యం ఆమెలో కనిపిస్తున్నట్లుంది. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా పెద్దగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టకపోవడం, ఏపీకి ఎవరినీ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిని నియమించకపోవడం బట్టి చూస్తుంటే షర్మిల విషయంలో చర్యలు ఉండకపోవచ్చంటున్నారు. కానీ అదే జరిగితే పార్టీకి మరింతనష్టం చేకూరుతుందన్న ఆందోళనలు బలంగా వినిపిస్తున్నాయి.