Bhumana Karunakar Reddy: తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి భూ ఆక్రమణల కేసులో తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తిరుపతికి చెందిన వెంకటేశ్వర ప్రసాద్‌ ఫిర్యాదు ఆధారంగా ఈనెల 12న పోలీసులు కేసు నమోదు చేశారు.

కరుణాకరరెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్‌ రెడ్డి, వ్యక్తిగత న్యాయవాది కలిసి విచారణకు వచ్చారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌, తిరుచానూరు సీఐ సునీల్‌ ఆయనను ప్రశ్నిస్తున్నారు.

ఫిర్యాదులో వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నది ఏమిటంటే.. వైకాపా హయాంలో 2023 నవంబరు 4న కరుణాకరరెడ్డి, ఆయన అనుచరులు తిరుపతి రూరల్‌ మండలం తనపల్లిలో తనకు చెందిన 7.91 ఎకరాల అప్రూవ్డ్‌ లేఅవుట్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. దశాబ్దాల కిందట నాటిన మామిడి, టేకు, జామ, నేరేడు చెట్లను కొట్టేశారు. ఆ భూమి నుంచి భూమన కుటుంబానికి చెందిన మామిడి తోటకు రోడ్డు వేసేందుకు యత్నించారని, అక్కడున్న తన మనుషులను బెదిరించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీఐ సునీల్‌కు అందజేశారు.

ఫిర్యాదు అందిన అదే రోజు కేసు నమోదైంది. దీనిపై భూమన, ఆయన కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణకు సహకరించాలని, దర్యాప్తు కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలకు సంబంధించి పోలీసులు భూమనను ప్రశ్నిస్తున్నారు.

Tags: