Ather Energy : ఓలాకు షాక్ ఇచ్చిన ఏథర్.. అమ్మకాల్లో దూకుడు.. నెట్‌వర్క్ విస్తరణలో సరికొత్త రికార్డు

నెట్‌వర్క్ విస్తరణలో సరికొత్త రికార్డు

Update: 2026-04-10 12:00 GMT

Ather Energy : భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న స్వదేశీ దిగ్గజం ఏథర్ ఎనర్జీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరిస్తూ ఏకంగా 700లకు పైగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు ఓలా ఎలక్ట్రిక్ హవా నడిచిన ఈ సెగ్మెంట్‌లో, ఇప్పుడు ఏథర్ తన దూకుడుతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కేవలం షోరూమ్‌ల సంఖ్యను పెంచడమే కాకుండా, అమ్మకాల్లోనూ ఓలాను వెనక్కి నెట్టి ఏథర్ తన సత్తా చాటుతోంది.

గత ఆర్థిక సంవత్సరం ఏథర్ ఎనర్జీకి ఒక స్వప్న సమానమైన ఏడాదిగా నిలిచింది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 351 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు మాత్రమే ఉండగా, కేవలం ఒక్క ఏడాదిలోనే మరో 350కి పైగా కొత్త అవుట్‌లెట్లను ఏథర్ జోడించింది. దీనివల్ల కంపెనీ మొత్తం నెట్‌వర్క్ సంఖ్య 700 దాటిపోయింది. ఇంత తక్కువ సమయంలో నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయడం అనేది ఆటోమొబైల్ రంగంలోనే ఒక అద్భుతమైన ఫీట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దూకుడు వెనుక కంపెనీ అనుసరిస్తున్న పక్కా వ్యూహమే ప్రధాన కారణం.

ఏథర్ తన విస్తరణ కోసం కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, Tier-2, Tier-3 నగరాల వైపు అడుగులు వేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తన పట్టును మరింత బలపరుచుకుంటూనే, మిడిల్ ఇండియా అని పిలవబడే చిన్న పట్టణాల్లోని కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో కస్టమర్లు కేవలం స్కూటర్లను చూడటమే కాకుండా.. టెస్ట్ రైడ్ తీసుకోవడం, ఛార్జింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం, ప్రోడక్ట్ ఫీచర్లను ప్రత్యక్షంగా అనుభవించడం వంటి సదుపాయాలు ఉన్నాయి.

బలమైన రిటైల్ నెట్‌వర్క్ ఫలితం కంపెనీ మార్కెట్ వాటాపై స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఏథర్ తన మార్కెట్ వాటాను 18.7 శాతానికి పెంచుకుంది. దీనివల్ల టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజ కంపెనీల తర్వాత మూడో స్థానంలో ఏథర్ పటిష్టంగా నిలిచింది. ఒకప్పుడు మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలాను సైతం అమ్మకాల విషయంలో వెనక్కి నెట్టి ఏథర్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. కస్టమర్లకు మెరుగైన సర్వీస్ అందించడమే లక్ష్యంగా ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఏథర్ ఎనర్జీ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టా భారీ వాల్యూమ్ డ్రైవర్‌గా మారింది. ఈ ఒక్క మోడల్ అమ్మకాలే 2.80 లక్షల యూనిట్లను దాటడం విశేషం. దీనితో పాటు స్పోర్టీ లుక్ కోరుకునే యువత కోసం 450X, 450S మోడళ్లు పట్టణ ప్రాంతాల్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవాలనుకునే సామాన్యుడికి ఏథర్ నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారింది. రానున్న కాలంలో మరిన్ని కొత్త మోడళ్లతో మార్కెట్‌ను ఏలేందుకు ఏథర్ సిద్ధమవుతోంది.

Tags:    

Similar News