Mahindra XUV 3XO: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దేశీయ దిగ్గజం మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను విజయవంతంగా విడుదల చేసింది. ఎక్స్ఓవీ 3ఎక్స్ఓ లైనప్‌లో సరికొత్తగా రెక్స్ ఎడ్జ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సరికొత్త ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.9.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీట్లు కోరుకునే మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును అద్భుతమైన హంగులతో తీర్చిదిద్దింది.

ఈ కొత్త రెక్స్ ఎడ్జ్ సిరీస్‌లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ పనోరమిక్ సన్‌రూఫ్ . రూ.10లక్షల కంటే తక్కువ ధర కలిగిన XUV 3XO వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీనితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, లెదరెట్ సీట్లు, రియర్-వ్యూ కెమెరా వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ఇక రెక్స్ ఎడ్జ్ (ఓ) వేరియంట్‌లో రూఫ్ రైల్స్, ఎలక్ట్రానిక్ ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి.

సేఫ్టీ విషయంలోనూ మహీంద్రా ఎప్పుడూ రాజీపడదు. ఈ కొత్త రెక్స్ ఎడ్జ్, రెక్స్ ఎడ్జ్ (ఓ) మోడళ్లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ప్రయాణికులందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లు, సీట్-బెల్ట్ రిమైండర్ వంటి పటిష్టమైన సేఫ్టీ ఫీచర్లు అందించారు. దీనివల్ల ఫ్యామిలీతో ప్రయాణించేటప్పుడు సంపూర్ణమైన రక్షణ లభిస్తుందని కంపెనీ భరోసా ఇస్తోంది.

పవర్ ట్రయిన్ విషయానికి వస్తే.. ఈ కారు రెండు పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లో లభిస్తుంది. 1.2-లీటర్ mStallion టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, సీఆర్‌డీఈ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌లను ఇందులో అమర్చారు. పెట్రోల్ మోడల్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుండగా, డీజిల్ మోడల్ మ్యాన్యువల్ లేదా ఏఎమ్‌టీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్, టెంకో రెడ్, నెబులా బ్లూ, గెలాక్సీ గ్రే వంటి ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ కారు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Tags: