Amul : టాప్ ఫుడ్ బ్రాండ్ గా మరోసారి అవతరించిన అమూల్.. రిపోర్టులో సంచలన విషయాలు

రిపోర్టులో సంచలన విషయాలు;

Update: 2025-06-30 03:48 GMT

Amul : అమూల్ మరోసారి దేశంలోనే టాప్ ఫుడ్ బ్రాండ్ గా నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా నివేదిక ప్రకారం.. అమూల్ బ్రాండ్ విలువ 4.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.34,000 కోట్లు). ఇక ఢిల్లీ-ఎన్‌సిఆర్ కు చెందిన మదర్ డెయిరీ 1.15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,600 కోట్లు) బ్రాండ్ విలువతో రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం మూడో స్థానంలో ఉన్న మదర్ డెయిరీ ఈసారి ఒక స్థానం పైకి వచ్చింది. నివేదికలో బ్రిటానియా మూడో స్థానంలో, కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ నాలుగో స్థానంలో.. డాబర్ ఐదో స్థానంలో నిలిచాయి. అమూల్ ఫుడ్ బ్రాండ్స్‌లో మాత్రమే కాదు.. భారతదేశంలోని టాప్ 100 బ్రాండ్స్‌లో కూడా 17వ స్థానాన్ని సాధించింది. ఇక మదర్ డెయిరీ 35వ స్థానంలో ఉంది. గత సంవత్సరం మదర్ డెయిరీ 41వ స్థానంలో ఉంది.

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండి జయేన్ మెహతా మాట్లాడుతూ.. "ఈ విజయం లక్షలాది మంది డెయిరీ రైతుల కష్టం, నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే మా నిబద్ధత ఫలితమే" అని అన్నారు. అమూల్ ప్రపంచంలోనే అతిపెద్ద రైతు-యాజమాన్య డెయిరీ కోఆపరేటివ్. ఇందులో 36 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇది రోజుకు 3.2 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తుంది. 50కి పైగా దేశాలలో పాలు, వెన్న, చీజ్, నెయ్యి, ఐస్‌క్రీమ్ వంటి తమ ఉత్పత్తులను అమ్ముతుంది.

ఇక మదర్ డెయిరీ ఎండి మనీష్ బందలిష్ మాట్లాడుతూ.. "ఈ ర్యాంకింగ్ మా వినియోగదారులు, రైతులు, భాగస్వాములు, ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం" అని అన్నారు. మదర్ డెయిరీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.17,500 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 16% ఎక్కువ. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ అనుబంధ సంస్థ అయిన మదర్ డెయిరీ ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం కింద మొదలైంది. ఇది పాలు, పాల ఉత్పత్తులతో పాటు ధారా బ్రాండ్ కింద వంట నూనెలు, సఫల్ బ్రాండ్ కింద పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ స్నాక్స్, పప్పులను అమ్ముతుంది.

ఈ రెండు బ్రాండ్లు కూడా తమ క్వాలిటీ, వినియోగదారుల నమ్మకంతోనే ఈ స్థాయికి చేరుకున్నాయి. అమూల్, మదర్ డెయిరీ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ మార్కెట్‌లో కూడా తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. ఇది భారతీయ డెయిరీ పరిశ్రమ బలాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

Tags:    

Similar News