ATM : విత్ డ్రాలు పెరుగుతున్నా.. భారీగా మూతపడుతున్న ఏటీఎంలు.. కారణం ఇదే ?
భారీగా మూతపడుతున్న ఏటీఎంలు.. కారణం ఇదే ?;
ATM : మన దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. యూపీఐ లాంటివి వచ్చిన తర్వాత జేబులో డబ్బులు పెట్టుకునే అవసరం కూడా చాలావరకు తగ్గింది. కానీ, ఈ మధ్య ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నా, ATMల నుండి విత్ డ్రాలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ బ్రాంచ్లను కూడా వేగంగా పెంచుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 2021-22లో దేశంలో 1,30,176 బ్యాంక్ బ్రాంచ్లు ఉంటే, 2024-25 నాటికి వాటి సంఖ్య 9.3శాతం పెరిగి 1,42,359కి చేరుకుంది. ఇదే సమయంలో ATMల నుంచి నగదు విత్ డ్రాలు 6% పెరిగి దాదాపు రూ.31 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, ఈ అన్ని పరిణామాల మధ్య బ్యాంకులు మాత్రం తమ ATMల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. మరి బ్యాంక్ బ్రాంచ్లు, ATMల నుంచి నగదు తీసుకోవడం పెరుగుతున్నా, ATMల సంఖ్యను బ్యాంకులు ఎందుకు తగ్గిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం.
గత ఐదేళ్లలో బ్యాంక్ బ్రాంచ్ల సంఖ్య 1,30,176 నుండి 1,42,359కి పెరిగింది. కానీ ఇదే సమయంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులు పెద్ద సంఖ్యలో ATMలను మూసివేశాయి. RBI డేటా ప్రకారం 2022-23 నుండి 2024-25 మధ్య దేశంలో దాదాపు 5 వేల ATMలు తగ్గాయి. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులకు చెందిన ATMల సంఖ్య 2020-21లో 2,11,332 ఉండేది. ఇది 2022-23 నాటికి 2,16,629కి పెరిగింది. కానీ, 2024-25లో మళ్ళీ తగ్గి 2,11,656కి చేరుకుంది. అంటే, గత రెండేళ్లలో ATMల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ATMలతో పాటు నగదు డిపాజిట్ చేసే యంత్రాలు సంఖ్యను కూడా బ్యాంకులు తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం తక్కువగా ఉన్న గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ATMలకు డిమాండ్ అలాగే ఉంది. అందుకే నగదు విత్డ్రాల్స్ సంఖ్య పెరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ATMల నుండి రూ.30.6 లక్షల కోట్ల నగదు విత్డ్రాల్స్ జరిగాయి. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.28.89 లక్షల కోట్లు మాత్రమే.
ఏటీఎంల సంఖ్య తగ్గడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏటీఎంలను నడపడం బ్యాంకులకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. క్యాష్ మేనేజ్మెంట్, క్యాసెట్ మార్చడం, సేఫ్టీ, విద్యుత్, రెంట్ వంటి మెయింటెనెన్స్ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి బ్యాంకులు ATMలను మూసివేస్తున్నాయి. దేశంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటివి అందుబాటులోకి రావడంతో చాలా మంది ప్రజలు నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్ను ఎంచుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. బ్యాంకులు తమ శాఖలను పెంచుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు ATMలకు బదులుగా నేరుగా బ్యాంక్ బ్రాంచ్ల నుంచే సేవలు పొందుతున్నారు. కొన్ని చోట్ల పాత ATMలను తొలగించి, వాటి స్థానంలో క్యాష్ రీసైక్లర్ మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నగదు తీసుకోవడానికి, డిపాజిట్ చేయడానికి రెండింటికీ ఉపయోగపడతాయి. అయితే మొత్తం సంఖ్య మాత్రం తగ్గుతోంది.