మన్యంలో సిరులు కురిపిస్తున్న బిర్యానీ ఆకులు
వ్యవసాయం దండగ అన్నమాట ఇటీవల ప్రతి నోటా వినిపిస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు. సరైన నీటి వసతి లేకపోవడం, ప్రకృతి విపత్తులు, చీడపీడలు, మద్దతు ధర లేకపోవడం, సాగు ప్రోత్సాహం కరువు అవ్వడం వంటి కారణాలతో వ్యవసాయం అంటేనే ఒక రకమైన భావం ఏర్పడింది. రైతులు సైతం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఎంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సరికొత్త సాగు విధానంలో అడుగుపెట్టిన కొంతమంది రైతులు విజయవంతం అయ్యారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా.. అధిక ఆదాయం ఇచ్చే పంటలను పండించి లక్షలు, కోట్లు ఆర్జించిన వారు ఉన్నారు. అటువంటి వారు మిగతా వారికి ఆదర్శంగా మారుతున్నారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర్ దినాజ్ పూర్ జిల్లా లఖిపూర్ గ్రామానికి చెందిన సుకుమార్ బర్మన్ అనే యువరైతు వినూత్నంగా ఆలోచించాడు. 2007లో తొలిసారి బిరియాని ఆకు సాగు మొదలుపెట్టాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో.. ఒక ఎకరాను బిరియాని ఆకు కోసం వదిలేశాడు. నాటిన మొక్కలు మూడేళ్ల తర్వాత చెట్లుగా ఎదిగాయి. వాటిని విక్రయిస్తే క్వింటా రూ.2500 వరకు పలికింది. బియ్యం క్వింటా వెయ్యి రూపాయలు కూడా రాని రోజులు ఇవి. ఆ లాభంతో ఉబ్బితబ్బిబైన సుకుమార్ బర్మన్ ఇతర రైతులను అటువైపు ప్రోత్సహించాడు. దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా బిర్యానీ ఆకు సాగు విస్తరించింది. ఎకరా పొలంతో మొదలుపెట్టిన సాగు.. ఎనిమిది వందల ఎకరాలకు చేరింది. 100 కోట్ల టన్నుల దాకా దిగుబడి వస్తోంది. చెట్లనుంచి దూసిన ఆకులను గ్రేడ్లను బట్టి విభజించి ఎండబెట్టే బాధ్యత మహిళదే. దీంతో మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుంది. బిర్యానీ ఆకు సాగులో ప్రతి మూడేళ్లకు ఒకసారి రైతు 5 లక్షల వరకు లాభ పొందుతున్నాడు. రైతులంతా కలిసి దీన్ని సుమారు 400 కోట్ల పరిశ్రమగా మార్చారు అంటే.. ఏ స్థాయిలో మార్పు చేశారో అర్థం అవుతోంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గూడెంలు అధికంగా ఉండేవి. 15 ఏళ్లు వచ్చేసరికి బాలికలకు అక్కడ వివాహం చేసేవారు. బాలురు సైతం చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లేవారు. అటువంటిది ఇప్పుడు ఆ గిరిజన గ్రామాల్లో బాల్యవివాహాలు తగ్గాయి. బాలికలతో పాటు బాలురు విశాఖతో పాటు విజయనగరంలో పాలిటెక్నిక్ డిప్లమోలలో చేరుతున్నారు. దానికి కారణం ప్రకృతి వ్యవసాయం. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ 30 గిరిజన గూడల్లో ఆర్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకృతి వ్యవసాయంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. పూర్తిగా మట్టిలోని సహజ పోషకాలను నమ్మి చేసేదే ఈ తరహా వ్యవసాయం. ఓ పంట కింద అంతర్ పంటలను వేస్తూ.. అవి పరస్పర పోషకాలుగా మారేలా చూస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి ఆగస్టు దాకా ఖాళీగా ఉండే పంట పొలాల్లో వంగ, బీర, సొర తదితర కూరగాయల సాగు చేపడుతున్నారు. ఇక్కడ రైతులు ఎకరం పొలంలోనే ఏడాదికి 25 రకాల పంటలను వేస్తున్నారు. ఏటా ఎకరాకు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుండడంతో తమ పిల్లలను చదువుకు ప్రోత్సహిస్తున్నారు. అంతరించిపోతున్న బార్లీ సాగును ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేశాడు సెతాన్ దుర్జేయ్ అనే యువకుడు. లద్దాక్ ప్రాంతంలో బార్లీ పంట విస్తారంగా పండేది. అయితే బార్లీ పంట సాగు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు లభించేది కాదు. దీంతో భారత సైనికుల దగ్గర బరువులు మోసే పోర్టర్ గా మారాడు. ఉత్తర భారత దేశంలో బార్లీ సూప్ లకు ఉండే డిమాండ్ చూసాడు. ఈ నేపథ్యంలో లద్దాక్ ప్రాంతంలో పండే బార్లీ ని.. ఎండు జున్నులకు వివిధ మూలికలను చేర్చి.. సూప్ మిక్స్ లను తయారుచేసి విక్రయించాడు. వాటికి మంచి ఆదరణ దక్కడంతో సియాచిన్ నేచురల్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. స్టార్ టాప్ కంపెనీగా ప్రారంభమైన దాని ప్రస్థానం.. ప్రతి బార్లీ రైతు కుటుంబంలో వెలుగు నింపుతోంది. సాగు గిట్టుబాటు అవుతోంది.