Stock Market : ట్రంప్ సునామీలో షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం

సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం;

Update: 2025-08-28 05:24 GMT

Stock Market : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతీయ ఉత్పత్తులపై కొత్త టారిఫ్‌లను ప్రకటించడంతో దేశీయ షేర్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. బుధవారం వినాయక చవితి సందర్భంగా మార్కెట్‌కు సెలవు కావడంతో గురువారం తెరుచుకోగానే ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్ల కంటే ఎక్కువ పతనమై 80,108 స్థాయికి చేరుకుంది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 176 పాయింట్లకు పైగా పడిపోయి 24,535 వద్ద ట్రేడ్ అవుతోంది.

భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభం

ఉదయం 9:25 గంటల సమయంలో మార్కెట్ తెరుచుకోగానే, సెన్సెక్స్ దాదాపు 678 పాయింట్లు (0.84%) పడిపోయింది. నిఫ్టీ కూడా 176.25 పాయింట్లు (0.71%) నష్టపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో మొత్తం 1458 కంపెనీల షేర్లు నష్టాల్లో కనిపించగా, 1023 కంపెనీల షేర్లు మాత్రమే లాభాలతో ట్రేడ్ అయ్యాయి. 195 షేర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.

ముఖ్యమైన స్టాక్స్ పతనం

ఈ రోజు ట్రేడింగ్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, జియో ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే, ఈ ప్రతికూల వాతావరణంలో కూడా హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ వంటి కొన్ని షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.

50% టారిఫ్‌ల ప్రభావం

బుధవారం నుంచి భారత్ ఉత్పత్తులపై అమెరికా 50% వరకు టారిఫ్‌లను విధించింది. దీని ప్రభావం ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడిన రంగాలపై పడింది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కార్పెట్, ఫర్నిచర్, రొయ్యలు వంటి రంగాలలోని కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా 0.88% మేర పతనమయ్యాయి. అంటే, పెద్ద కంపెనీల షేర్లతో పాటు మధ్యస్థ, చిన్న స్థాయి కంపెనీల షేర్లు కూడా ఈ పతనానికి గురయ్యాయి. మార్కెట్ ఒత్తిడిని సూచించే ఇండియా VIX ఇండెక్స్ దాదాపు 5% పెరిగింది, ఇది ఇన్వెస్టర్లలో భయం, అనిశ్చితి పెరిగినట్లు సూచిస్తుంది.

అన్ని సెక్టార్లలోనూ పతనం

సెన్సెక్స్, నిఫ్టీతో పాటు దాదాపు అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు 0.9% పడిపోయాయి. ఐటీ, రియాల్టీ వంటి ఇతర ముఖ్యమైన సెక్టార్లు కూడా నష్టాలను చవిచూశాయి. ఇది మార్కెట్‌లో విస్తృతమైన పతనాన్ని సూచిస్తుంది. మంగళవారం కూడా మార్కెట్ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ 849.37 పాయింట్లు పడిపోయి 80,786.54 వద్ద, నిఫ్టీ 255.70 పాయింట్లు కోల్పోయి 24,712.05 వద్ద ముగిశాయి.

Tags:    

Similar News