Inflation: మారుతున్న షాపింగ్ అలవాట్లు.. కొత్త ద్రవ్యోల్బణం లెక్కలు ఇవే
కొత్త ద్రవ్యోల్బణం లెక్కలు ఇవే;
Inflation: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి, ముఖ్యంగా రెపో రేటు వంటి వాటిని నిర్ణయించడానికి వినియోగదారుల ధరల సూచిక లెక్కలను ఆధారంగా చేసుకుంటుంది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి సీపీఐని ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ సీపీఐలో ఒక పెద్ద మార్పు చేయాలని ప్లాన్ చేసింది. బ్లింక్ఇట్, జెప్టో, బిగ్బాస్కెట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో లభించే వస్తువుల ధరలను కూడా సీపీఐ లెక్కల్లో చేర్చాలని నిర్ణయించింది.
ఎందుకు ఈ మార్పు?
ప్రస్తుతం సీపీఐ కింద కిరాణా సామాగ్రి నుండి టెలిఫోన్ బిల్లులు, పెట్రోల్-గ్యాస్ ధరలు వంటివి కలిపి ఒక 'ప్రొడక్ట్ బాస్కెట్'ను తయారు చేస్తారు. ఆ తర్వాత వివిధ మార్కెట్లలో ఆ బాస్కెట్ ధరల ఆధారంగా ఒక సూచికను తయారు చేసి ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. అయితే, దేశంలో వినియోగదారుల కొనుగోలు విధానం చాలా వేగంగా మారుతోంది. ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సీపీఐలో ఈ కొత్త మార్పును తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.
12 నగరాల నుండి డేటా సేకరణ
ప్రభుత్వ ప్లాన్ ప్రకారం ఆన్లైన్ షాపింగ్ డేటాను దేశంలోని 25 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 12 నగరాల నుండి సేకరిస్తారు. ఈ నగరాల్లో ప్రజలు ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల నుండి ఎలా కొనుగోలు చేస్తున్నారు, ఆ ప్లాట్ఫారమ్లలో కూరగాయలు, పండ్లు నుండి కిరాణా సామాగ్రి వరకు ధరలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ డేటా ఆధారంగా కొత్త వినియోగదారుల ధరల సూచికను తయారు చేస్తారు.
ఈ కొత్త విధానం వల్ల ప్రభుత్వం పట్టణ, గ్రామీణ స్థాయిలలో ద్రవ్యోల్బణాన్ని మరింత కచ్చితంగా అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా, దేశంలో వినియోగదారుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను కూడా అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ఈ కొత్త విధానం ఆధారంగా సీపీఐ డేటాను 2026 నుండి విడుదల చేయడం ప్రారంభించవచ్చు.
ఆన్లైన్ డేటాను ఎలా సేకరిస్తారు?
నగరాల నుండి ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల డేటాను సేకరించడానికి ప్రభుత్వం ఆయా నగరాల్లోని ప్రముఖ ఆన్లైన్ అమ్మకందారులను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత వారి నుండి ధరల డేటాను సేకరిస్తుంది. ఈటీ నివేదిక ప్రకారం.. ప్రభుత్వం లక్నో వంటి నగరంలో బిగ్ బాస్కెట్ నుండి బియ్యం ధరల డేటాను తీసుకోవచ్చు, అదే బెంగళూరులో జెప్టో లేదా అమెజాన్ నుండి సేకరించవచ్చు. ప్రస్తుతం, సీపీఐ కోసం ప్రభుత్వం 1,181 గ్రామీణ, 1,114 పట్టణ మార్కెట్ల నుండి డేటాను సేకరిస్తోంది. కొత్త పద్ధతిలో మార్పుల తర్వాత, దేశంలో మొత్తం 2,900 మార్కెట్ల నుండి వినియోగదారుల ధరల సూచిక కోసం రిటైల్ ధరల డేటాను సేకరిస్తారు.
మొబైల్ రీఛార్జ్ల నుంచి విమాన ప్రయాణాల వరకు
ఇంతేకాకుండా, కొత్త సీపీఐలో మొబైల్, ఇంటర్నెట్, కేబుల్ టీవీ వంటి రీఛార్జ్ల డేటాతో పాటు OTT ప్లాట్ఫారమ్లు, విమాన, రైలు ప్రయాణ ఛార్జీలను కూడా చేర్చాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే, సీపీఐ బేస్ ఇయర్ ను కూడా 2012 నుండి 2024కి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులన్నీ దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులను.. వినియోగదారుల కొనుగోలు శక్తిని మరింత కచ్చితంగా అంచనా వేయడానికి సహాయపడతాయి.