PM Modi at Jewar: చెరకు గడలతో పెట్రోల్ కష్టాలకు చెక్.. పీఎం మోదీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా
పీఎం మోదీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా
PM Modi at Jewar: జేవర్లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేదికపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఇంధన భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను ఇంధన రంగంలో స్వయం సమృద్ధిగా మార్చడంలో ఎథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్లో ఎథనాల్ కలపడం) ఒక చారిత్రాత్మక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, దేశంలోని కోట్లాది మంది రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఒక గొప్ప మార్గమని పీఎం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారత్ ఇంధన విధానంలో వస్తున్న పెను మార్పుల గురించి వివరించారు. ప్రస్తుతం దేశం పెట్రోల్లో 20% ఎథనాల్ కలిపే (E20) లక్ష్యాన్ని చేరుకోవడానికి అతి దగ్గరలో ఉందని ఆయన అన్నారు. గత 10-11 ఏళ్లలో ఈ రంగంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, ఇది దేశ ఇంధన భద్రతను బలపరుస్తుందని పీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వాహనాలన్నీ ఈ గ్రీన్ ఫ్యూయల్తో నడిచేలా చర్యలు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఒక్క శాతం నుంచి 20 శాతానికి.. అద్భుత విజయం
ఒక దశాబ్దం క్రితం భారత్లో ఎథనాల్ బ్లెండింగ్ కేవలం 1% మాత్రమే ఉండేదని, దానిని ఇప్పుడు 20% స్థాయికి తీసుకురావడం దేశానికే గర్వకారణమని ప్రధాని అన్నారు. ప్రభుత్వ పటిష్టమైన ప్రణాళికలు మరియు రైతుల చురుకైన భాగస్వామ్యం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు. కేవలం 10 ఏళ్లలోనే ఇంత పెద్ద మార్పు రావడం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.
విదేశీ మారక ద్రవ్యం ఆదా.. ఖజానాకు ఊరట
ముడి చమురు దిగుమతుల కోసం భారత్ ఏటా వేల కోట్లు విదేశాలకు ఖర్చు చేస్తోంది. అయితే ఎథనాల్ బ్లెండింగ్ వల్ల గత ఏడాది సుమారు 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతిని తగ్గించగలిగామని ప్రధాని వెల్లడించారు. ఒకవేళ మనం ఎథనాల్ వాడకపోయి ఉంటే, దాదాపు రూ.1.5 లక్షల కోట్లు విదేశాలకు తరలిపోయేదని ఆయన లెక్కలతో సహా వివరించారు. ఈ డబ్బు ఇప్పుడు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని పీఎం అన్నారు.
రైతులకు ఆదాయ వనరుగా ఎథనాల్
ఎథనాల్ ఉత్పత్తి ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి జరుగుతుంది. దీనివల్ల రైతులకు తమ పంటకు అదనపు గిట్టుబాటు ధర లభిస్తోందని, ముఖ్యంగా చెరకు రైతులకు ఇది వరప్రసాదమని ప్రధాని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, పర్యావరణ హితమైన గ్రీన్ ఫ్యూయల్ ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. జేవర్ ఎయిర్పోర్ట్ వేదికగా.. ఎథనాల్ అంటే కేవలం ఒక ఇంధనం మాత్రమే కాదని, అది ఆత్మానిర్భర్ కిసాన్ (స్వయం సమృద్ధి కలిగిన రైతు) వైపు వేస్తున్న అడుగు అని ప్రధాని మోదీ ముగించారు.