Quantum Valley : అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో క్యూపిఐఏఐ భాగస్వామ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ;
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమారవతి క్వాంటం వాలీ లో క్యూపిఐఏఐ భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీలో క్యూపీఐఏఐ కూడా భాగస్వామ్యం వహించనుంది. దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు క్యూపిఐఏఐ సంస్థ ముందుకు వచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్తో చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే, విద్యార్ధుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి క్యూపిఐఏఐను కోరారు. తద్వారా విద్యార్ధులు, పరిశోధకులు, స్టార్టప్లు క్వాంటం అల్గారిథంలు, అప్లికేషన్లను రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
వివిధ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ సేవలు
రాష్ట్రంలో వివిధ పంటల సాగులో కచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపడేందుకు ఈ సాంకేతికత దోహద పడాలని సీఎం పేర్కోన్నారు. రాష్ట్రంలో నీటి వనరులను సమర్ధంగా నిర్వహించేందుకు వీలుగా క్వాంటం టెక్నాలజీని వాడాలన్నారు. వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ తదితర అంశాల్లోనూ క్వాంటం సిమ్యులేషన్ను సమర్ధంగా వినియోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలోనూ క్వాంటం టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచన చేస్తోంది. క్వాంటం లాంటి ఆధునిక సాంకేతికత ద్వారా సామాన్య ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్ని మెరుగు పర్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించటమే లక్ష్యంగా క్యూపిఐఏఐ, నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.