Basmati Rice : పోర్టులో ఇరుక్కుపోయిన రూ.2000కోట్ల బాస్మతి బియ్యం.. ఎందుకిలా జరిగింది
ఎందుకిలా జరిగింది;
Basmati Rice : మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతదేశ వ్యవసాయ ఎగుమతులపై కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు లక్ష టన్నుల బాస్మతి బియ్యం దేశంలోని వివిధ ఓడరేవులలో నిలిచిపోయాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ పరిస్థితి బియ్యం ఎగుమతిదారులలో ఆందోళన పెంచడమే కాకుండా, భారత ప్రభుత్వం ముందు ఒక తీవ్రమైన వాణిజ్య సవాలును కూడా నిలిపింది.
బియ్యం ఎందుకు నిలిచిపోయాయి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ, ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ, మొత్తం మధ్యప్రాచ్యంలో వాణిజ్య అస్థిరతను క్రియేట్ చేశాయి. ఈ ప్రాంతంలోని అనేక ఓడరేవులలో కార్యకలాపాలు నెమ్మదించాయి. షిప్పింగ్ మార్గాలు కూడా ప్రభావితమయ్యాయి. భద్రతా కారణాల వల్ల చాలా షిప్పింగ్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి లేదా వేరే మార్గాల గుండా వెళ్తున్నాయి. దీని ప్రత్యక్ష ప్రభావం భారతదేశం నుంచి ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, యెమెన్, యూఏఈ వంటి మధ్యప్రాచ్య దేశాలకు జరిగే బాస్మతి బియ్యం ఎగుమతులపై పడింది.
ఆగిపోయిన డెలివరీలు
బియ్యం సరుకులు ఓడరేవులలో సిద్ధంగా ఉన్నాయి.. కానీ వాటిని పంపడం సాధ్యం కావడం లేదు. వ్యాపార చెల్లింపులు కూడా మధ్యలో నిలిచిపోయాయి. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన చెల్లింపులు నిలిచిపోయాయని లేదా వాటిని పూర్తి చేయడంలో అడ్డంకులు వస్తున్నాయని చెబుతున్నారు.
ఎగుమతిదారులకు భారీ నష్టం
బాస్మతి బియ్యం ఆర్డర్లు ఎక్కువగా భారతదేశానికి బలమైన మార్కెట్ ఉన్న దేశాల నుంచే వస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సరుకు పంపడం కష్టం కావడమే కాకుండా, ఇప్పటికే పంపిన ఆర్డర్లకు సంబంధించిన డబ్బు కూడా సమయానికి అందడం లేదు. పరిస్థితులు త్వరగా మెరుగుపడకపోతే, ఎగుమతి చేసే కంపెనీలు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పరిశీలిస్తున్న ప్రభుత్వం
భారత ప్రభుత్వం ఈ సమస్యపై నిశితంగా దృష్టి సారించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది. అయితే, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గేవరకు ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. భారతదేశానికి బాస్మతి బియ్యం ఒక ముఖ్యమైన ఎగుమతి ఉత్పత్తి. దీని ద్వారా ఏటా బిలియన్ల డాలర్ల విదేశీ మారకం లభిస్తుంది. కానీ ప్రస్తుత భూ-రాజకీయ పరిస్థితులు ఈ వ్యాపారాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఉద్రిక్తతలు మరింత పెరిగితే, బాస్మతి బియ్యం మాత్రమే కాదు, చమురు, ఆహార ఉత్పత్తులు, ఇతర ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం పడవచ్చు.