SIP Crisis: మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వస్తున్న జనాలు.. అసలు కారణాలివే!
అసలు కారణాలివే!
SIP Crisis: మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది సంపద సృష్టించడానికి ఒక సురక్షితమైన మార్గమని అందరూ భావిస్తారు. అయితే, 2025 డిసెంబర్ నాటి ఏఎంఎఫ్ఐ గణాంకాలు పరిశీలిస్తే.. ఈ రంగంలో పెట్టుబడుల వేగం తగ్గడం కనిపిస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నికర పెట్టుబడులు రూ.28 వేల కోట్లకు తగ్గిపోయాయి. డెట్ ఫండ్స్ నుంచి కూడా భారీగా డబ్బు వెనక్కి వెళ్తోంది. దీనివల్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం ఆస్తుల విలువ కూడా తగ్గింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారని ఈ మార్పులు సూచిస్తున్నాయి.
పరిమితి ముగియడం ఒక ప్రధాన కారణం
చాలా మంది ఇన్వెస్టర్లు తమ ఎస్ఐపీలు ఎందుకు ఆగిపోతున్నాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కానీ, అసలు కారణం ఏంటంటే.. చాలా మంది 3, 5 లేదా 7 ఏళ్ల కాలపరిమితితో ఎస్ఐపీలను మొదలుపెట్టారు. ఆ సమయం ముగియగానే, ఎస్ఐపీలు ఆటోమేటిక్గా ఆగిపోయాయి. ఇన్వెస్టర్లు వాటిని మళ్లీ పొడిగించుకోకపోవడం వల్ల, గణాంకాల్లో ఎస్ఐపీల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం సాంకేతిక కారణమే తప్ప, మార్కెట్ పై నమ్మకం పోవడం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మార్కెట్ ఒడిదుడుకులు, అసహనం
గత కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్ విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతోంది. దీనివల్ల కొత్తగా పెట్టుబడి మొదలుపెట్టిన వారికి ఆశించిన స్థాయిలో రిటర్న్స్ రావడం లేదు. కొంతమందికి లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే త్వరగా కోటీశ్వరులు అవ్వండి అనే కథనాలను నమ్మి ఎస్ఐపీలు మొదలుపెట్టిన వారు, ఆరు నెలల్లోనే అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారు. అలా జరగకపోవడంతో నిరాశ చెంది తమ పెట్టుబడులను మధ్యలోనే విరమించుకుంటున్నారు.
పెరుగుతున్న ఇంటి ఖర్చులు, ద్రవ్యోల్బణం
కుటుంబ బడ్జెట్పై ద్రవ్యోల్బణం ప్రభావం కూడా ఎస్ఐపీలపై పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు మరియు హోమ్ లోన్ ఈఎంఐల భారం పెరగడంతో సామాన్యులు తమ పొదుపు మొత్తాలను తగ్గించుకుంటున్నారు. ఏదైనా అత్యవసర ఖర్చు వచ్చినప్పుడు అందరూ ముందుగా చేసే పని ఎస్ఐపీని ఆపేయడం. అలాగే, సొంతంగా ఇల్లు లేదా కారు కొనడం వంటి అవసరాల కోసం కూడా చాలా మంది తమ మ్యూచువల్ ఫండ్ నిధిని వాడుకుంటున్నారు.
మార్కెట్ టైమింగ్ చేసే ప్రయత్నం
మరికొంత మంది ఇన్వెస్టర్లు తెలివిగా ఆలోచిస్తున్నామనుకుని తప్పు చేస్తున్నారు. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉందని, ఇప్పుడు ఎస్ఐపీ ఆపివేసి.. మార్కెట్ పడిపోయినప్పుడు మళ్లీ మొదలుపెడదామని భావిస్తున్నారు. కానీ, మార్కెట్ ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు పెరుగుతుందో ఊహించడం అసాధ్యం. ఇలా మార్కెట్ ను టైమ్ చేయాలనుకోవడం వల్ల ఇన్వెస్టర్లు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. ఎస్ఐపీ అనేది దీర్ఘకాలిక లక్ష్యం అని, కేవలం సహనంతో ఉండేవారే మంచి లాభాలను పొందుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.