Stock Market : ఉవ్వెత్తున ఎగిసిన సెన్సెక్స్.. ఇన్వెస్టర్ల జేబుల్లోకి రూ. 23 లక్షల కోట్లు

ఇన్వెస్టర్ల జేబుల్లోకి రూ. 23 లక్షల కోట్లు

Update: 2026-02-03 09:09 GMT

Stock Market : ట్రంప్-మోదీ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ దెబ్బకు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు కనీవినీ ఎరుగని లాభాలను కురిపించింది. మంగళవారం ట్రేడింగ్ మొదలవ్వడమే ఒక సునామీలా మొదలైంది. ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని సెకన్లలోనే రూ. 23 లక్షల కోట్లు పెరగడం చూస్తుంటే, మార్కెట్ ఏ రేంజ్‌లో ఊగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు తగ్గిస్తున్నట్లు ప్రకటించగానే భారత మార్కెట్లకు ఊపిరి వచ్చినట్లయింది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ. 4.55 లక్షల కోట్లుగా ఉండగా, మంగళవారం ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వడమే రూ. 4.78 లక్షల కోట్ల మార్కును తాకింది. దీనివల్ల ఇన్వెస్టర్లు కేవలం ఒక్క సెషన్ ప్రారంభంలోనే రూ. 23 లక్షల కోట్ల రూపాయల లాభాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సెన్సెక్స్ ఏకంగా 4200 పాయింట్లు ఎగబాకడం ట్రేడింగ్ చరిత్రలోనే అతిపెద్ద జంప్‌లలో ఒకటిగా నిలిచింది.

అన్ని రంగాల్లోనూ పండగే.. రియల్ ఎస్టేట్ టాప్

మార్కెట్ పెరుగుదల కేవలం ఒక రంగానికే పరిమితం కాలేదు. రియల్ ఎస్టేట్ షేర్లు 4 శాతం కంటే ఎక్కువ వృద్ధితో దూసుకుపోతున్నాయి. అమెరికా డీల్ వల్ల ఎగుమతులు పెరుగుతాయన్న ఆశతో ఐటీ, ఆటో, మెటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు. బ్యాంకింగ్ రంగం కూడా గట్టి మద్దతు ఇస్తోంది. నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు 3 శాతం వరకు పెరగడం వల్ల మార్కెట్‌లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.

అదానీ షేర్ల జోరు.. రాకెట్ లాంటి లాభాలు

నేటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 9 శాతం పెరగగా, అదానీ పోర్ట్స్ 7 శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది. ఈ డీల్ వల్ల పోర్ట్, లాజిస్టిక్స్ వ్యాపారం భారీగా పెరుగుతుందన్న అంచనాలే ఇందుకు కారణం. వీటితో పాటు బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కూడా టాప్ గెయినర్లుగా నిలిచాయి.

రికార్డు స్థాయిలో నిఫ్టీ.. ఐటీ, ఫార్మా అదుర్స్

నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా తన పాత రికార్డులను చెరిపేస్తూ 25,812 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజాలు, డాక్టర్ రెడ్డీస్ వంటి ఫార్మా కంపెనీలు అమెరికా టారిఫ్ తగ్గింపు వల్ల నేరుగా లాభపడనున్నాయి. అందుకే ఈ షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మొత్తం మీద నేడు భారత మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో చాటిచెప్పింది.

Tags:    

Similar News