Actress Anasuya: హిందూ ధర్మంపై వ్యాఖ్యల దుమారం: క్లారిటీ ఇచ్చిన నటి అనసూయ
క్లారిటీ ఇచ్చిన నటి అనసూయ
Actress Anasuya: ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచారు. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మంపై వివాదానికి దారితీశాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. ఈ వ్యవహారంపై అనసూయ స్వయంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.
తన మాటలను కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని, సగం సగం వీడియోలను ఎడిట్ చేసి వక్రీకరించారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ మత విశ్వాసాలను, ఆచారాలను కించపర్చేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం తనపై అభ్యంతరకర కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే వ్యక్తుల తీరును మాత్రమే తాను ప్రశ్నించానని తెలిపారు.
"నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని.. నా ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల నాకు సంపూర్ణ గౌరవం ఉంది" అంటూ అనసూయ తన పోస్ట్లో పేర్కొన్నారు. హనుమంతుడి ధైర్యం, బలమే తనకు స్ఫూర్తి అని.. తప్పును తప్పు అని ధైర్యంగా చెప్పడం తన ధర్మమే తనకు నేర్పిందని చెప్పారు. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండలేనని, మతం ఆధారంగా తాను ఎవరిపైనా ఎప్పుడూ నిర్ణయాలకు రానని తేల్చిచెప్పారు.
కేవలం వ్యూస్, సోషల్ మీడియా ట్రోల్స్ కోసం ఎడిట్ చేసిన క్లిప్లు, సగం సగం కథనాలను నమ్మవద్దని.. అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయానికి రావాలని ఆమె నెటిజన్లను కోరారు. ఏది ఏమైనా అనసూయ పెట్టిన ఈ వివరణ పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.