Director Sailu Kampati: నెగెటివ్ టాక్ వస్తే, అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతా.. షాకింగ్ ఛాలెంజ్
షాకింగ్ ఛాలెంజ్
Director Sailu Kampati: విరాట పర్వందర్శకుడు వేణు ఉడుగుల నిర్మాణ భాగస్వామ్యంతో, ఈటీవీ విన్ ఒరిజినల్స్ సమర్పణలో తెరకెక్కిన తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలోకి విడుదల కానుంది. నవంబర్ 20, బుధవారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా యూనిట్ సభ్యులు సినిమాపై తమకున్న అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్న దర్శకుడు సాయిలు కంపాటి మీడియా వేదికగా ఒక బోల్డ్ స్టేట్మెంట్ను విడుదల చేశారు. "ఈ సినిమాకు ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తే, నేను ఏమాత్రం ఆలోచించకుండా అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతాను." అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తన చిత్రంపై తనకున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెప్పేందుకే ఆయన ఈ సవాలు విసిరారు. ఈ సినిమా ఖమ్మం-వరంగల్ సరిహద్దులోని ఒక గ్రామంలో 2004లో జరిగిన 15 ఏళ్ల నరక ప్రయాణం చేసిన జంట కథ ఆధారంగా రూపొందించబడింది. హీరో రాజు, తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లు ఊహించుకుంటూ 'రాజు వెడ్స్ రాంబాయి' అని రాస్తుంటాడు. ఈ ప్రేమికులకు ఏం జరిగింది, ఎలాంటి విషాద పరిణామాలు ఎదుర్కొన్నారు అనే అంశాలను భావోద్వేగంగా చూపించారు. నిర్మాత వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది '7/జీ బృందావన్ కాలనీ', 'RX 100', 'బేబీ' వంటి కల్ట్ లవ్ స్టోరీల సరసన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు సాయిలు కంపాటి ఈ సందర్భంగా ప్రేక్షకులను కోరుతూ, "ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. దయచేసి నెగెటివ్ ప్రచారం చేయవద్దు. మీకు నచ్చకపోతే వదిలేయండి, కానీ నెగెటివ్గా మాట్లాడకండని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ప్రధాన పాత్రల్లో అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వి రావుతో పాటు శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి కీలక పాత్రలు పోషించారు.