CM Revanth’s Strong Comments: సినిమా టికెట్ ధరలు పెంచితే.. కార్మికులకు ఏమి ఒరిగింది? సీఎం రేవంత్ హాట్ కామెంట్స్!

కార్మికులకు ఏమి ఒరిగింది? సీఎం రేవంత్ హాట్ కామెంట్స్!

Update: 2025-10-28 15:18 GMT

CM Revanth’s Strong Comments: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సినిమా టికెట్ ధరల పెంపు, సినీ కార్మికుల సంక్షేమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో మాట్లాడిన ఆయన, హైదరాబాద్‌ను ప్రపంచ సినీ పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఐటీ, ఫార్మా రంగాల మాదిరిగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందాలని, మీ సహకారంతో హాలీవుడ్ సినిమాలు హైదరాబాద్‌లో షూట్ అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.

సినీ కార్మికుల కష్టాలు తనకు బాగా తెలుసని చెప్పుకున్న సీఎం, అధికారంలోకి వచ్చిన తర్వాత 'గద్దర్' పేరుతో సినీ అవార్డులు ప్రారంభించామని గుర్తుచేశారు. “కార్మికులు బాగుంటేనే దర్శకులు, నిర్మాతలు బాగుంటారు” అంటూ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున రూ.10 కోట్ల వెల్ఫేర్ ఫండ్‌గా డిపాజిట్ చేస్తున్నామని ప్రకటించారు.

సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. “టికెట్ ధరలు పెంచితే హీరోలకు, నిర్మాతలకు లాభం వస్తుంది. కానీ కార్మికులకు ఏమి ఒరిగింది? పెంచిన టికెట్ ధరలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం జీవో ఇస్తుంది” అని షరతు విధించారు. “మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి. ఎంత పెద్ద నిర్మాత అయినా సరే, కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో డబ్బు జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

కార్మికుల పిల్లలకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, భవిష్యత్తులో ఇళ్ల స్థలాల కేటాయింపు చేస్తామని ఆయన కొనసాగించారు. సినీ పరిశ్రమలో కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో సినిమా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News