సినిమా ప్రివ్యూనే ఆ దర్శకుడుకి ఆఖరి చూపైంది
తెలుగు సినిమా పరిశ్రమలో జరిగిన ఒక విషాద సంఘటన ఇది;
తెలుగు సినిమా పరిశ్రమలో జరిగిన ఒక విషాద సంఘటన ఇది.. తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు.. తాను తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్కు గురై కన్నుమూసిన వైనం అందరినీ కలచి వేస్తుంది.. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) తన హృదయానికి ఎంతో దగ్గరై, తను డైరక్ట్ చేసిన సినిమా 'బ్రహ్మాండ' ప్రివ్యూ ప్రదర్శనను చూస్తుండగా దురదృష్టవశాత్తు బ్రెయిన్ స్ట్రోక్తో కుప్పకూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.. సినిమా విడుదలకు వారం రోజులు ముందే ఆయన మృతిచెందడం చిత్రయూనిట్ ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చోటుచేసుకుంది.. రాంబాబుకి బ్రెయిన్ స్ట్రోక్ రాగానే హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం నిమ్స్కి తీసుకెళ్ళారు.. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
మంగళవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.. సీనియర్ నటీమణి ఆమని ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గుకథ నేపథ్యంలో "బ్రహ్మాండ" అనే చిత్రానికి రాంబాబు దర్శకత్వం వహించారు.. జూలై 18న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న వేళ ఆయన అకాల మరణం చిత్రయూనిట్ను దుఃఖ సాగరంలో ముంచెత్తింది.. రివైండ్ చేస్తే, రాంబాబు సుమారు 150 సినిమాలు, 60 టీవీ సీరియళ్ళకు కో-డైరెక్టర్గా పనిచేశారు.. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే "అంతరంగాలు", "అన్వేషణ" వంటి ఈటీవీ టాప్ సీరియళ్ళకు ఆయన కీలకంగా పనిచేశారు.. తెలుగు చిత్రసీమ ఒక నిశ్శబ్ద యోధుడిని కోల్పోయింది.. తన కలను తెరపై చూపించే మధుర క్షణాలను చవి చూడకుండానే ఆ కళాకారుడు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోవడం చాలా బాధాకరం.. అంతా బ్రహ్మాండమే కానీ.. ఆయన లోకం మాత్రం శూన్యం అయింది.