పాపం... భైరవం...
వెనకటి రోజులైతే వేరు... కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల ప్రభావం బాగా పెరిగిన తరువాత ఎవరు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్ధితి. ప్రధానంగా ప్రజా సంబంధాలు అవసరమైన వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్ధితి. మరీ ముఖ్యంగా రాజీయ పార్టీల గురించి ఆ పార్టీ అధినేతల గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే వారి సోషల్ మీడియా సైన్యాలు విరుచుకుపడిపోతున్నాయి. ఇటువంటి పరిస్ధితులు ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ ఉత్పన్నమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సినమా ఫంక్షన్లలో రాజీయాలు మాట్లాడటం, ఎవరో ఒక నాయకుడిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం ఎక్కువై పోయింది. ఇదే సమయంలో సినిమా ఫంక్షన్లలో ఎవరైనా తమ నాయకుడి గురించి తప్పుగా మాట్లాడితే ఆయన సోషల్ మీడియా టీమ్లు హ్యాష్ ట్యాగ్లు పెట్టి మరీ సదరు సినిమాను బ్యాన్ చేయాలని ట్రెండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలు సినిమా మీద తీవ్ర ప్రభావం చూపించి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినా సినీ పరివారానికి మాత్రం బుద్ది రావడం లేదు. తాజాగా అటువంటి పరిస్థితి ఇప్పుడు భైరవం సినిమాకు ఎదురయ్యింది.
భైరవం మూవీకి సంబందించి ఇటీవల జరిగిన ఒక వేడుకలో ఆ సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల చేసిన అసందర్భ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ సినిమాకు చేటు చేసే పరిస్ధితులు తలెత్తాయి. ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోలు. చాలా కాలం తర్వాత వెండితెర మీద కనిపించబోతున్నారు. ఎలాంటి ఈగోలకు పోకుండా మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఈ చిత్రం లో కలిసి నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది అనే టాక్ కూడా ఉంది. కానీ డైరెక్టర్ విజయ్ నోటి దూల కారణం గా ఇప్పటికే వైసీపీ ఫ్యాన్స్ కి దొరికిపోయాడు. వాళ్ళు ఇతను బయట కనిపిస్తే కొట్టేసేలా ఉన్నారు మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన వైసీపీ ని ఉద్దేశించి కామెంట్స్ చేసాడు. భైరవం ట్రైలర్ లోని డైలాగ్ ని గుర్తు చేస్తూ 'ధర్మం కోసం దేవుడు ఎదో ఒక రూపం లో వస్తుంటాడు... గత ఏడాది ఎన్నికల సమయం లో అదే జరిగింది' అంటూ కామెంట్ చేసాడు. దీనికి వైసీపీ అభిమానులు ట్రిగ్గర్ అయ్యారు. గత మూడు రోజుల నుండి 'బాయ్ కాట్ భైరవం' ట్రెండ్ ని సోషల్ మీడియా లో చేస్తున్నారు.
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే 2011 వ సంవత్సరం లో ఫేస్ బుక్ లో విజయ్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న మార్ఫింగ్ ఫోటో ని అప్లోడ్ చేసి మెగా ఫ్యామిలీ ని ఎగతాళి చేసాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ బయటపడింది. దీంతో నువ్వు ఇలాంటోడివా అని మెగా ఫ్యాన్స్ విజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసాడు. అభిమానుల దెబ్బకు డైరెక్టర్ దిగొచ్చాడు. వెంటనే ట్విట్టర్ లో స్పందిస్తూ 'మెగా అభిమానులకు గుడ్ ఈవెనింగ్… మెగా ఫ్యాన్స్ భైరవం చిత్రం ని బాయ్ కాట్ చేస్తామంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. కారణం ఫేస్ బుక్ లో నా అకౌంట్ నుంచి ఎప్పుడో 2011 వ సంవత్సరం లో చిరంజీవి, రామ్ చరణ్ గారికి సంబంధించి ఒక మార్ఫింగ్ ఫోటో వెలుగులోకి వచ్చింది... నిజానికి ఆ పోస్ట్ నేను వెయ్యలేదు. అప్పట్లో నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయినప్పటికీ నా అకౌంట్ నుంచి పడింది కాబట్టి బాధ్యత తీసుకొని క్షమాపణలు చెప్తున్నాను. నేను కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలను చూసే ఇండస్ట్రీ కి వచ్చాను. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కి నేను పని చేసాను. ఆయనే నన్ను సాయి ధరమ్ తేజ్ కి పరిచయం చేసి ఇతనితో సినిమాలు చేసుకో అన్నాడు. నన్ను అంత ప్రోత్సహించిన మనుషులపై నేనెలా విషం కక్కుతాను?' అంటూ ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే డైరెక్టర్ వివరణతో మెగా ఫ్యాన్స్ మెత్తబడినా వైసీపీ సోషల్ మీడియా సైన్యం మాత్రం విజయ్ కనకమేడలను వదిలే ప్రసక్తే లేదని బాయ్ కాట్ భైరవం ట్రెండింగ్ ని మాత్రం ఆపడం లేదు.