ధియేటర్ల బందు అంశంలో హరిహర వీరమల్లుని ఎందుకు తెచ్చారు
నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి మండిమాపాటు;
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి ధియేటర్లు బందు చేస్తామని ఎగ్జిబిటర్లు నుంచి వెలువడిన ప్రకటన సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమ నుంచి కూడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజులు స్పందించారు. తాజాగా ఇదే వ్యవహారంపై విప్లవ చిత్రాల కథానాయకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి రియాక్ట్ అయ్యారు. మల్టీప్లెక్స్ మాదిరే సింగిల్ ధియేటర్లకు కూడా పర్సంటేజి విధానం అమలు చేయాలని నారాయణ మూర్తి కోరారు. అయితే ఈ విషయాన్ని కొందరు పక్కదారి పట్టించి హరిహర వీరమల్లు సినిమాకు నష్టం చేకూర్చే కుట్ర అంటూ కొందరు కొత్త ధియరీని తెరపైకి తేవడం దుర్మార్గం అని నారాయణ మూర్తి మండిపడ్డారు. సింగిల్ స్క్రీన్ దియేటర్ల మనుగడ కోసమే ఎగ్జిబిటర్లు బందు అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నేను ఎప్పటి నుంచో సింగిల్ ధియేటర్లకు పర్సంటేజీ విధానం ఉండాలని అంటున్నానని ఈ విధానం ఇండస్ట్రీకి మేలు చేస్తుందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానం ఉందని కానీ హరిహర వీరమల్లు కోసమే ధియేటర్ల బందు చేస్తున్నారన్నది అబద్దమన్నారు. పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేస్తారు... ఆయన కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసం కాదన్నారు. హరిహర వీరమల్లు గురించి కాకుండా సినీపరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చిద్దాం రండని పిలిస్తే పవన్ కళ్యాణ్ పై గౌరవం మరింత పెరిగేదన్నారు. బంద్ అనేది బ్రహ్మాస్త్రం వంటిదని, పర్సంటేజీల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సమయంలో ఈ వ్యవహారాన్ని హరిహర వీర మల్లు సినిమా రిలీజ్ కి లింకు పెట్టడం సరికాదని నారాయణ మూర్తి అన్నారు. మేం మీ బిడ్డలం ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి పర్సంటేజ్ అంశాన్ని పక్కదారి పట్టించద్దని నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. మంత్రి కందుల దుర్గేష్ కూడా చాలా తప్పుగా మాట్లాడారని నారాయణ మూర్తి అన్నారు. పవన్ సినిమా రిలీజ్ అవుతుంటే ధేయేటర్లు బందు చేయడం దుర్మార్గమని మంత్రి దుర్గేష్ అనడం భావ్యం కాదన్నారు. ఈ పర్సెంటేజీల వ్యవహారం ఇప్పటిది కాదని గతంలోనే ఛాంబర్ ముందు టెంటు వేసుకుని ఆందోళన చేసినట్లు నటుడు, నిర్మాత నారాయణ మూర్తి గుర్తు చేశారు.