Tirumala Tirupati : తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణానికి కమిటీ
టీటీడీ ట్రస్ట్ బోర్టు సమావేశంలో నిర్ణయం;
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు
- వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయంరూ.10 నుండి 20 లక్షలకు పెంపు
- టీటీడీలో 142 కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు
తిరుమలలో మూడొవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ఒక కమిటీ వేయాలని తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు, టీటీడీ ఈఓ శ్యామలరావుల అధ్యక్షతన టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్, ఈఓలు టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి దేవాలయంలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందించేదుకు రూ.4.35 కోట్లు టీటీడీ నుంచి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే తిరుమలలో భక్తుల సౌకర్యార్ధం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయంన చేయనున్నట్లు పేర్కొన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతవరణం పెంపొందించడానికి టీటీడీ ట్రస్ట్ బోర్డు ఆమోదించినట్లు చెప్పారు. తిరుమలలో శిలా తోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ తో పాటు డీపీఆర్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్, ఈఓలు తెలిపారు. సీయం చంద్రబాబు ఆదేశాల మేరు శ్రీవారి వైభవానని విశ్వవ్యాప్తం చేసేందుకు వివిధ దేశాల్లో శ్రీవేంకటేశ్వరుడి ఆలయాల నిర్మాణాల అధ్యయనానికి నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను బోర్డుకు సమర్పించిందని, ఈ నేవేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయించిందన్నారు. భక్తులకు మరింత సేవ చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాలుగురు కోఆర్డినేటర్లను భర్తీ చేయడానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.
భక్తులు సైబర్ మోసాలకు గురికాకండా నియంత్రించేందుక తిరుమలలో సైబర్ సెక్యూరిటీ ల్యాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్, ఈవోలు తెలిపారు. కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం. తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం. అదేవిధంగా తిరుమలలో పాత బడిన హెచ్వీడీసీలోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని నిర్ణయం. సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయం. వేద పరిరక్షణలో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవదాయశాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం. రాష్ట్ర దేవాదాయశాఖ సూచనల మేరకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీలుగా విభజన. మూడు కేటగిరీల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒకే కేటగిరీ కింద రూ.10 లక్షలు చెల్లించే విధానంలో మార్పు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు, ఈఓ శ్యామలరావులు తెలిపారు.