Sri Venugopala Swamy: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆగమశాస్త్రోక్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

రాత్రి 7.30 గంటలకు స్కంధ పుష్కరిణిలో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి తెప్ప విహారాన్ని తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వీరాస్వామి, ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: